Sanju Samson : వాంఖడేలో సంజూ సునామీ సెంచరీ.. ఒకే ఇన్నింగ్స్తో 5 రికార్డులు బద్దలు
Sanju Samson : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్పై సంజూ శాంసన్ అద్భుత సెంచరీతో చెలరేగి, చెన్నై సూపర్ కింగ్స్కు భారీ స్కోరు అందించడంతో పాటు ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ముంబై ఇండియన్స్పై సంజూ శాంసన్ విశ్వరూపం
సంజూ శాంసన్ సునామీ సృష్టించాడు. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో 33వ ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో సంజూ అద్భుతమైన సెంచరీ సాధించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టులో ఓపెనర్గా వచ్చిన శాంసన్, ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
కేవలం 54 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేసి తన కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటి నమోదు చేశాడు. శాంసన్ మెరుపు సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్ ద్వారా సంజూ శాంసన్ పలు అరుదైన రికార్డులను సాధించాడు.
ముంబైపై సెంచరీ కొట్టిన తొలి సీఎస్కే బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్పై సెంచరీ సాధించడం ఏ బ్యాటర్ కైనా సవాలే. అయితే, సంజూ శాంసన్ ఈ మ్యాచ్తో ఒక అద్భుతమైన ఘనతను అందుకున్నాడు. ముంబై ఇండియన్స్పై ఐపీఎల్లో సెంచరీ బాదిన మొట్టమొదటి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్గా సంజూ రికార్డు సృష్టించాడు. గతంలో ఎందరో దిగ్గజాలు సీఎస్కే తరపున ఆడినా, ముంబై లాంటి బలమైన జట్టుపై ఈ ఘనత సాధించడం శాంసన్కే సాధ్యమైంది.
ఒకే సీజన్లో రెండు సెంచరీలు
ఈ 2026 ఐపీఎల్ సీజన్లో సంజూ శాంసన్ భీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో చేసిన 101* పరుగులు ఈ సీజన్లో అతనికి రెండో సెంచరీ. తద్వారా, ఒకే ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా శాంసన్ నిలిచాడు. ఇంతకుముందు 2018లో షేన్ వాట్సన్ మాత్రమే సీఎస్కే తరపున ఒకే సీజన్లో రెండు సెంచరీలు సాధించాడు. ఇప్పుడు శాంసన్ ఆ దిగ్గజం సరసన చేరాడు.
ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు బాదిన భారతీయుల జాబితాలో సంజూ
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ తాజా సెంచరీతో కలిపి ఐపీఎల్లో శాంసన్ మొత్తం 5 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. దీంతో అతను కేఎల్ రాహుల్ (5 సెంచరీలు)తో సమానంగా నిలిచాడు. ప్రస్తుతం అతని కంటే ముందు విరాట్ కోహ్లీ (8) మాత్రమే ఉన్నాడు. జోస్ బట్లర్ (7), క్రిస్ గేల్ (6) వంటి దిగ్గజాల తర్వాతి స్థానాల్లో శాంసన్ కొనసాగుతున్నాడు.
టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయుడిగా రోహిత్ సరసన సంజూ
ఓవరాల్ టీ20 క్రికెట్ ఫార్మాట్లో సంజూ శాంసన్ తన 8వ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఘనతతో అతను టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (8 సెంచరీలు) సరసన చేరాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ చెరో 9 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా, శాంసన్ ఇప్పుడు మూడవ స్థానానికి ఎగబాకాడు.
సీఎస్కే తరపున మల్టిపుల్ సెంచరీలు కొట్టిన సంజూ శాంసన్
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తరపున ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన అతికొద్ది మంది ఆటగాళ్ల క్లబ్లో సంజూ చేరిపోయాడు. మురళీ విజయ్ (2), షేన్ వాట్సన్ (2), రుతురాజ్ గైక్వాడ్ (2) తర్వాత సీఎస్కే జెర్సీలో రెండు సెంచరీలు సాధించిన నాలుగో ప్లేయర్గా సంజూ శాంసన్ ఘనత సాధించాడు. ముఖ్యంగా పేసర్లను చెడుగుడు ఆడుకుంటూ 40 బంతుల్లో 83 పరుగులు చేయడం విశేషం.

