టీమిండియా టెస్ట్ టీంకు కొత్త కోచ్.? అసలు మ్యాటర్ చెప్పేసిన బీసీసీఐ
Team India: టీమిండియా టెస్టు జట్టు కోచ్గా గౌతమ్ గంభీర్ స్థానంపై బీసీసీఐ పునరాలోచన చేస్తోంది. టెస్టు ఫార్మాట్లో జట్టు ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి. వీవీఎస్ లక్ష్మణ్ను టెస్టు కోచ్గా నియమించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ పునరాలోచన..
టీమిండియా టెస్టు జట్టు కోచ్గా గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐ పునరాలోచన చేస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వన్డేలు, టీ20లకు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ కొనసాగినా, టెస్టు ఫార్మాట్ విషయంలో ఆయనకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, టెస్టు జట్టుకు కొత్త కోచ్గా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమించే విషయమై బీసీసీఐ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
దక్షిణాఫ్రికాతో ఓటమి..
గత దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్లో టీమిండియా ఘోర పరాజయం పాలవడంతో గౌతమ్ గంభీర్ కోచింగ్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సొంత గడ్డపై ఇంత దారుణంగా ఓడిపోవడం పట్ల అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ధర్మశాలలో కొందరు అభిమానులు గంభీర్ను కోచ్గా తొలగించాలంటూ నినాదాలు కూడా చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో, గంభీర్ కూడా టెస్టు కోచ్గా బీసీసీఐ ఇంకెవరినైనా తీసుకుంటుందేమో అన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత బీసీసీఐ అంతర్గతంగా టెస్టు జట్ల కోచింగ్ విధానంపై చర్చించినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ సమావేశం..
బీసీసీఐలో కీలక స్థాయిలో ఉన్న కొందరు అధికారులు, లెజెండరీ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ను సంప్రదించి, రెడ్ బాల్ టీమ్కు కోచ్గా బాధ్యతలు స్వీకరించే విషయంపై చర్చించారు. టెస్టు జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టడానికి లక్ష్మణ్కు ఆసక్తి ఉందా లేదా అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లక్ష్మణ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో హెడ్ ఆఫ్ క్రికెట్గా కొనసాగుతున్నారు.
టీ20, వన్డేలకు..
గౌతమ్ గంభీర్కు టీమిండియా వైట్ బాల్ జట్లతో ఐసీసీ, ఏసీసీ ట్రోఫీలలో విజయవంతమైన రికార్డు ఉన్నప్పటికీ, టెస్టు ఫార్మాట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై పది టెస్టు పరాజయాలు గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై విమర్శల దాడిని మరింత పెంచాయి. గంభీర్కు 2027 వన్డే ప్రపంచ కప్ వరకు బీసీసీఐతో ఒప్పందం ఉంది. అయితే, రాబోయే టీ20 ప్రపంచకప్లో టీమిండియా నిలబెట్టుకున్నా లేదా ఫైనల్ చేరినా గంభీర్కు వైట్ బాల్ ఫార్మాట్లో పెద్దగా ఢోకా ఉండకపోవచ్చు. ఒకవేళ అది జరగకపోతే, గంభీర్ కోచింగ్ కాంట్రాక్ట్ను బీసీసీఐ సమీక్షించే అవకాశం ఉంది.
కోచింగ్ స్ప్లిట్..
టీ20 ప్రపంచకప్ తర్వాత రెండు నెలల పాటు ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో, కోచింగ్ విధానంపై స్ప్లిట్ కోచింగ్ లేదా ఒకే కోచ్తో కొనసాగాలా అనే అంశంపై బీసీసీఐకి నిర్ణయం తీసుకునేందుకు సమయం ఉంటుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఈ పరిస్థితుల్లో, గౌతమ్ గంభీర్ టెస్టు కోచ్గా కొనసాగుతారా లేదా, వీవీఎస్ లక్ష్మణ్ రాక ఖాయమవుతుందా అన్నది క్రికెట్ అభిమానులలో ఆసక్తికరంగా మారింది. అయితే బీసీసీఐ మాత్రం ఇదంతా కూడా వట్టి రూమర్స్ అని కొట్టిపారేసింది.

