T20 World Cup 2026 : అక్షర్ పటేల్ను పక్కన పెట్టి భారత్ తప్పు చేసిందా?
T20 World Cup 2026 : దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఆడించి భారత్ తప్పు చేసిందా? అహ్మదాబాద్లో టీమిండియా వ్యూహాత్మక వైఫల్యం, భారత జట్టు మార్పులు ఎలాంటి ప్రభావం చూపించాయని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అక్షర్ పటేల్ అవుట్.. సుందర్ ఇన్ : టీమిండియా వ్యూహం తప్పిందా?
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫామ్ లో ఉన్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను కాదని, వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకోవడం భారత్ ఓటమిపై ప్రభావం చూపిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టాప్-6 లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్.. అదే కారణమా?
టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, అక్షర్ పటేల్ను పక్కన పెట్టడం కఠినమైన నిర్ణయమని, అయితే ఇది కేవలం వ్యూహాత్మక మార్పు మాత్రమేనని తెలిపాడు. దక్షిణాఫ్రికా టాప్ 6 బ్యాటర్లలో ముగ్గురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు (క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్లర్, ర్యాన్ రికెల్టన్) ఉండటంతో, వారికి చెక్ పెట్టేందుకు ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకున్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. సఫారీ బ్యాటర్లపై ఆఫ్ స్పిన్ ప్రభావం చూపుతుందనే అంచనాతో టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
సుందర్ బౌలింగ్లో తేలిపోయిన వ్యూహం
వ్యూహాత్మకంగా వాషింగ్టన్ సుందర్ను తీసుకున్నా, మైదానంలో ఫలితం మాత్రం మరోలా ఉంది. పవర్ప్లేలో బౌలింగ్కు వచ్చిన సుందర్ తన మొదటి ఓవర్లోనే 11 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం మీద సుందర్ తన స్పెల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా కీలక బ్యాటర్లైన డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ క్రీజులో ఉన్నప్పుడు వారిని కట్టడి చేయడంలో సుందర్ విఫలమయ్యాడు. మరోవైపు, ఈ వికెట్ పై మంచి రికార్డు ఉన్న అక్షర్ పటేల్ ఉండి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బ్యాటింగ్లోనూ దెబ్బతీసిన అక్షర్ లేని లోటు
188 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు వచ్చాడు. గత మ్యాచ్లలో ఒత్తిడిలో అద్భుత ఇన్నింగ్స్లు ఆడిన అక్షర్ పటేల్ స్థానంలో వచ్చిన సుందర్, కేవలం 11 పరుగులు మాత్రమే చేసి అనవసర షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ వంటి అనుభవం ఉన్న ఫినిషర్ జట్టులో లేకపోవడం భారత్ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ను బలహీనపరిచింది.
పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో పొరపాటా?
అహ్మదాబాద్లోని ఈ నల్ల మట్టి పిచ్పై బంతి కాస్త స్లోగా వస్తుందని, స్పిన్నర్లకు సహకరిస్తుందని అంచనా వేశారు. అయితే దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 3 వికెట్లు తీసి భారత్ను దెబ్బతీయగా, భారత స్పిన్నర్లు మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చారు. అక్షర్ పటేల్ తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్తో వేగంగా బంతులు విసరగలడు, ఇది ఇలాంటి పిచ్లపై వికెట్లు తీయడానికి సహాయపడేది. అక్షర్ వికెట్లు తీయడమే కాకుండా పరుగులను కూడా నియంత్రించగల సామర్థ్యం కలవాడు. అక్షర్ ఉంటే మిల్లర్, బ్రేవిస్ జోడీని త్వరగానే విడదీసే అవకాశం కూడా ఉండేది.
అభిమానుల ఆగ్రహం.. వ్యూహాత్మక తప్పిదం
మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు అక్షర్ పటేల్ ను ఆడించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్-అప్స్ కోసం కేవలం ఒక్కరిని చూసి, నిలకడగా రాణిస్తున్న ఆటగాడిని పక్కన పెట్టడం భారత్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శిస్తున్నారు. కేవలం ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని అక్షర్ను పక్కన పెట్టడం వల్ల అటు బౌలింగ్లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ భారత్ నష్టపోయింది. ఈ ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు ఇప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.
