India vs Pakistan : టీమిండియాకు టెన్షన్.. అభిషేక్ శర్మ హెల్త్ కండిషన్ ఏంటి?
India vs Pakistan : టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్తో జరగనున్న కీలక పోరుకు ముందు అభిషేక్ శర్మ ఫిట్నెస్పై సందిగ్ధత నెలకొంది. తాజాగా వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ అతని ఆరోగ్యంపై కీలక విషయాలు వెల్లడించారు.

పాకిస్థాన్ మ్యాచ్కు ముందే అభిషేక్ శర్మ షాకింగ్ అప్డేట్
భారత్ పాక్ టీ20 వరల్డ్ కప్ సమరానికి రంగం సిద్ధమైంది. అయితే అందరి కళ్లు ఇప్పుడు యువ ఓపెనర్ అభిషేక్ శర్మపైనే ఉన్నాయి. కడుపులో ఇన్ఫెక్షన్తో ఆసుపత్రి పాలై, 2 కేజీల బరువు తగ్గిన అభిషేక్.. చిరకాల ప్రత్యర్థిపై బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. తాజాగా వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ ఇచ్చిన క్రేజీ అప్డేట్స్ టీమిండియా అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలో జరగనున్న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో పోరుకు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అందుబాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. తీవ్రమైన కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ కారణంగా గత కొన్ని రోజులుగా అతను ఇబ్బంది పడుతున్నారు.
అభిషేక్ శర్మ గురించి వరుణ్ చక్రవర్తి ఏం చెప్పారు?
నమీబియాతో మ్యాచ్ తర్వాత వరుణ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ అభిషేక్ శర్మ తర్వాతి మ్యాచ్ ఆడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. "అతను తర్వాతి మ్యాచ్ ఆడతాడని నేను అనుకుంటున్నాను. నేను అతనితో మాట్లాడాను, అతను బాగున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ రోజు అతను ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను కోలుకుంటున్నట్లు అతను చెప్పాడు" అని వరుణ్ పేర్కొన్నారు. నమీబియాపై భారత్ ఘనవిజయం సాధించిన తర్వాత వరుణ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అభిషేక్ శర్మ హెల్త్ అప్డేట్: 2 కేజీల బరువు తగ్గాను
అభిషేక్ శర్మ స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. టీమ్ ఇండియా పేసర్ అర్షదీప్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వ్లాగ్లో అభిషేక్ కనిపించారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత తాను 2 కేజీల బరువు తగ్గానని అతను వెల్లడించారు. ప్రస్తుతం తాను కేవలం పప్పు, అన్నం మాత్రమే తీసుకుంటున్నానని, ఇంకా 100 శాతం ఫిట్నెస్ సాధించలేదని తెలిపారు. తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్, డీహైడ్రేషన్ వల్ల అభిషేక్ బలహీనపడ్డారు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జాగ్రత్త
అంతకుముందు నమీబియాతో మ్యాచ్ టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అభిషేక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అతను కోలుకోవడానికి మరో ఒకటి రెండు మ్యాచ్లు పట్టవచ్చని పేర్కొన్నారు. టీమ్ మేనేజ్మెంట్ అతని దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. అయితే శుక్రవారం అతను నెట్స్లో తేలికపాటి ప్రాక్టీస్ చేయడం అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.
ప్రత్యామ్నాయంగా సంజూ శాంసన్
ఒకవేళ అభిషేక్ శర్మ పాకిస్థాన్తో మ్యాచ్కు అందుబాటులో లేకపోతే, సంజూ శాంసన్ ఓపెనర్గా కొనసాగే అవకాశం ఉంది. నమీబియాతో జరిగిన మ్యాచ్లో శామ్సన్ కేవలం 8 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి తన ఫామ్ను నిరూపించుకున్నారు. ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడుతుండగా, శాంసన్ బ్యాకప్ ఓపెనర్గా జట్టుకు సేవలందిస్తున్నారు.
జట్టులోకి కీలక ఆటగాళ్ల రీఎంట్రీ
మరోవైపు, భారత్కు శుభవార్త ఏమిటంటే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చారు. అనారోగ్యం కారణంగా అమెరికాతో మ్యాచ్కు దూరమైన బుమ్రా, ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశారు. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా గాయం నుండి కోలుకుని జట్టుతో చేరారు. ఇప్పుడు అందరి దృష్టి ఆదివారం నాటి హై-వోల్టేజ్ మ్యాచ్పైనే ఉంది.

