IND vs PAK : పాకిస్థాన్ను పాతాళానికి తొక్కిన భారత్.. గెలుపు వీరులు వీరే
IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్పై భారత్ ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ విధ్వంసం, బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్ లో విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కొలంబోలో పాక్ పనిపట్టిన భారత్.. సూపర్ విక్టరీ
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ జట్టు కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడు విజయాలు సాధించిన భారత్ గ్రూప్ ఏ లో 6 పాయింట్లు సాధించి సూపర్ 8 కు అర్హత సాధించింది. పాక్ పై అద్భుత విజయం వెనుక ఐదు కీలక కారణాలు ఉన్నాయి. వాటిని గమనిస్తే..
ఇషాన్ కిషన్ విధ్వంసకర ఆరంభం
భారత్ గెలుపులో అత్యంత కీలక పాత్ర ఇషాన్ కిషన్దే. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ అవుటైనా, ఇషాన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేసి పాక్ బౌలర్లను దెబ్బతీశాడు. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అతను చేసిన మెరుపు దాడి వల్ల భారత్ 9 ఓవర్లలోనే బలమైన స్థితికి చేరుకుంది. ఇషాన్ కిషన్ సృష్టించిన ఈ వేగమే భారత్ 175 పరుగుల భారీ స్కోరు సాధించడానికి పునాది వేసింది.
బుమ్రా పదునైన ఆరంభం.. పాక్ వెన్ను విరిచింది
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ను జస్ప్రీత్ బుమ్రా కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రెండో ఓవర్లోనే వికెట్లు తీసి పాక్ టాప్ ఆర్డర్ను ఒత్తిడిలోకి నెట్టాడు. బుమ్రా స్పెల్ వల్ల బాబర్ ఆజం వంటి కీలక ఆటగాళ్లు పరుగులు చేయడానికి తడబడ్డారు. బుమ్రా 2 వికెట్లు తీయడమే కాకుండా, అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి పాక్ రన్ రేట్ను కట్టడి చేశాడు.
తిలక్ వర్మ సమయోచిత పోరాటం
రెండో వికెట్కు ఇషాన్ కిషన్తో కలిసి తిలక్ వర్మ నెలకొల్పిన 87 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ మలుపు తిప్పింది. ఒకవైపు ఇషాన్ ధాటిగా ఆడుతుంటే, తిలక్ వర్మ (25) మరోవైపు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. కేవలం బ్యాటింగ్లోనే కాకుండా, బౌలింగ్లోనూ ఒక వికెట్ తీసి జట్టు విజయంలో ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. తన బౌలింగ్ లో ఎక్కువ పరుగులు కూడా ఇవ్వకుండా పొదుపుగా వేశాడు.
మిడిల్ ఓవర్లలో మెరిసిన బౌలర్లు
భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, పేసర్ హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్లలో పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. హార్దిక్, అక్షర్, వరుణ్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. పాక్ బ్యాటర్లు ఉస్మాన్ ఖాన్ (44), షాహీన్ అఫ్రిదీ మినహా ఎవరూ రెండంకెల స్కోరు దాటలేకపోయారంటే మన బౌలర్ల ఆధిపత్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒత్తిడిని అధిగమించిన సూర్యకుమార్ కెప్టెన్సీ
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫీల్డ్ ప్లేస్మెంట్, బౌలింగ్ మార్పులతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. బ్యాటింగ్లోనూ 32 పరుగులతో కీలక సహకారం అందించాడు. పాక్ ప్రధాని, పీసీబీ సృష్టించిన రాజకీయ డ్రామాల మధ్య, మైదానంలో ప్రశాంతంగా ఉంటూ జట్టును నడిపించడం భారత్ విజయానికి మరో ప్రధాన కారణం.
భారత్ విజయానికి ఐదు కారణాలు
- పవర్ప్లేలో ఇషాన్ కిషన్ బాదుడు: 40 బంతుల్లో 77 పరుగులు చేసి పాక్ను ఆత్మరక్షణలో పడేశాడు.
- బుమ్రా ఇనిషియల్ బ్రేక్ త్రూ: రెండో ఓవర్లోనే వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు.
- మెరుగైన భాగస్వామ్యాలు: రెండో వికెట్కు ఇషాన్-తిలక్ జోడించిన 87 పరుగులు కీలకం.
- బౌలింగ్: నలుగురు బౌలర్లు (హార్దిక్, బుమ్రా, అక్షర్, వరుణ్) తలో రెండు వికెట్లు తీయడం.
- పాక్ స్టార్ల వైఫల్యం: బాబర్ ఆజం (5), సామ్ అయూబ్ (6)లను తక్కువకే అవుట్ చేయడం. దీంతో ఒత్తిడిలోకి వెళ్లిన పాకిస్తాన్ మళ్లీ కోలుకోలేదు.

