దేవాలయాలు కొండలపైనే ఎందుకుంటాయో తెలుసా?
భారతదేశంలో చాలా దేవాలయాలు ఎత్తైన కొండలు, పర్వతప్రాంతాల్లో ఉన్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ పర్వతాలమధ్య దేవాలయాలను చూస్తుంటాం. అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లోనే తిరుమలలో ఏడుకొండలు, యాదగిరిగట్టపై దేవాలయాలున్నాయి. ఇలా దేవుళ్లు కొండలపైనే వెలియడానికి కారణమేంటో తెలుసా?

Temples
Temples : తిరుమల ఏడుకొండలపై వెలిసాడు కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి. యాదగిరిగుట్టపై కొలువయ్యాడు నరసింహస్వామి. అన్నవరం కొండపై సత్యనారాయణస్వామి, సింహాచలం కొండపై అప్పన్నస్వామి, కోటప్పకొండపై త్రికోటేశ్వరస్వామి... ఇలా దేవుళ్లు ఎక్కువగా ఎత్తైన కొండలపైనే ఉంటారు. ఇలా హిందూ దేవాలయాలే కాదు కొన్ని ముస్లిం, క్రైస్తవ ప్రార్థనా మందిరాలు దర్గాలు, చర్చిలు కూడా కొండలపై ఉంటాయి. ఇలా అందరు దేవుళ్ళు కొండలపైనే ఎందుకు కొలువయ్యారో తెలుసా? దీని వెనుక ఆధ్యాత్మిక, భౌతిక, శాస్త్రీయ కారణాలున్నాయి. ఇలా దేవాలయాలు కొండపై ఉండటానికి గల కారణాన్ని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చక్కగా వివరించారు.
Temples
దేవుళ్లు కొండలపై ఎందుకు కొలువయ్యారంటే...
మనలోని నిజమైన భక్తి ఆ దేవుడిని సైతం ప్రసన్నం చేస్తుందని పెద్దలు చెబుతుంటారు... ఆయన అనుగ్రహంతో మన కోరికలు తీరతాయని చెబుతుంటారు. అయితే ఆ దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కేవలం భక్తి ఒక్కటే సరిపోతుంది... ఇతర బంధాలు, బాధ్యతలు పక్కనబెట్టాలి. ఇది తెలియజేసేందుకు దేవుళ్ళు కొండపై వెలుసారని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వివరించారు.
మనం భూమి నుండి పైకి వెళుతున్నకొద్ది ఆక్సిజన్ తగ్గుతుంది. అందువల్లే పర్వతారోహకులు పైకి వెళుతున్నకొద్ది బరువును తగ్గించుకుంటారు... అంటే వెంటతెచ్చుకున్న బ్యాగులు, వాటర్ బాటిల్స్ వంటివి వదిలేయాల్సి ఉంటుంది. కేవలం ఒంటిపై బట్టలు, అత్యవసర సామాగ్రిని మాత్రమే తీసుకెళతారు. పైకి వెళుతుంటే ఆక్సిజన్ తగ్గి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది... అందువల్లే పర్వతారోహకులు బరువును కిందే వదిలేస్తారు.
సేమ్ ఇలాగే భక్తులు కూడా తమ బరువులు, బాధ్యతలు కిందే వదిలేసి తనవద్దకు రావాలని దేవుడు కోరుకుంటాడట. ఇలా భౌతిక ప్రపంచం పట్ల అంటే బంధాలు, బందుత్వాలు, ఆశలు, కోరికలు, ఆకర్షణలు, ఇష్టాలు, అసహ్యాలు మొదలైన వాటిని వదిలి వైరాగ్యంతో తనవద్దకు చేరితేనే ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందట. వీటన్నింటిని కిందే వదిలేసి తనవద్దకు రావాలన్నట్లుగా ఆ దేవుడు ఎత్తైన కొండలు, గుట్టలపై వెలుస్తాడని గరికపాటి నరసింహారావు తన ఆధ్యాత్మిక ప్రవచనంలో వివరించారు.
<p>yadadri</p>
దేవాలయాలు కొండపై ఉండటానికి మరిన్ని కారణాలు :
దేవుళ్లు ఆకాశంలో ఉంటారని అన్ని మతాల విశ్వాసం. మైదాన ప్రాంతాల కంటే ఎత్తైన కొండలు ఆకాశానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆ దేవుడికి దగ్గరగా ఉండేలా దేవాలయాలను కొండలపై నిర్మించారనే వాదన ఉంది.
ఇక కొండప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కాబట్టి అక్కడ దేవాలయాలు నిర్మిస్తే భక్తులకు ప్రశాంతంగా దైవారాధన, ధ్యానం చేసుకోవచ్చు. ఆహ్లదకరమైన వాతావరణాన్ని అందించేందుకే దేవాలయాలను కొండలపై నిర్మించారని పెద్దలు చెబుతుంటారు.
పూర్వకాలంలో ఏ ఆపద వచ్చినా దేవాలయాలే ప్రజలను రక్షించేవి. అంటే వరదలతో పాటు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు తలదాచుకునే విధంగా దేవాలయాలను ఎత్తైన కొండలపై నిర్మించారని చెబుతుంటారు.
సాధారణంగా మైదానప్రాంతాల్లో కంటే కొండప్రాంతాల్లోని గాలిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. నైట్రస్ ఆక్సైడ్ ను లాఫింగ్ గ్యాస్ అని అంటారు... అంటే ఇది మనసును ప్రశాంతంగా ఉంచి హాయిగా నవ్వుకునేలా చేస్తుంది. ఇలా దేవాలయాల్లో కూడా ప్రశాంత వాతావరణం ఉండాలనే కొండప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించి ఉంటారని సైన్స్ కూడా చెబుతోంది.,
దేవాలయాలను కొండలపై నిర్మించడం వెనుక శ్రద్ధ, భక్తి, విజ్ఞాన సూత్రమూ ఉంది. భక్తుడు శరీరంగా మాత్రమే కాదు, మనసుగా కూడా ఏకాగ్రతతో భగవంతుని వైపు ప్రయాణించాలనే సందేశాన్ని ఇది ఇస్తుంది. కొండ ఎక్కడం ద్వారా భౌతిక ప్రపంచం నుంచి స్వల్ప విరామం తీసుకుని, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశమిస్తాయి.