- Home
- National
- Car Burial: కోటిన్నర బెంజ్ కారును మరణించిన వ్యక్తితో పాటూ పాతి పెట్టిన కుటుంబం.. ఎందుకో తెలుసా?
Car Burial: కోటిన్నర బెంజ్ కారును మరణించిన వ్యక్తితో పాటూ పాతి పెట్టిన కుటుంబం.. ఎందుకో తెలుసా?
Car Burial: ఒక కుటుంబం చనిపోయిన కుటుంబ సభ్యునితో పాటూ అతను వాడిన కారును కూడ పాతిపెట్టేశారు. కానీ ఈ పని వాళ్లను పెద్ద చిక్కుల్లోకి నెట్టింది. అసలు కారును ఎందుకు పూడ్చిపెట్టారు? ఆ తర్వాత ఏం జరిగింది?

వింత అంత్యక్రియలు
ఇంట్లోని వారు చనిపోయినప్పుడు వారికి ఆ కుటుంబానికి ఎంతో బాధ. అంత్యక్రియల సమయంలో అతడికి ఇష్టమైన ఆహారాలు వడ్డించడం వంటివి చేస్తారు. అలాగే ఇష్టమైన వస్తువులను కూడా పెట్టడం వంటివి చూస్తుంటాం. చైనాలో ఇలాంటి ఘటనే జరిగింది. కానీ, చనిపోయిన వ్యక్తితో పాటు అతని కారును పాతిపెట్టి ఓ కుటుంబం చిక్కుల్లో పడింది. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్లో 70 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. అతనికి కార్లంటే ప్రాణం. ఎంతో కష్టపడి మెర్సిడెస్ బెంజ్ కారు కొనుక్కున్నాడు. ఎప్పుడూ అదే కారులో తిరిగేవాడు. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అందుకే అతను చనిపోయాక, కుటుంబ సభ్యులు అతని ఇష్టమైన కారును కూడా పాతిపెట్టారు.
సమాధి పక్కనే కారు
కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని పాతిపెట్టిన ప్రదేశం పక్కనే, సమాధి పక్కనే జేసీబీతో మరో పెద్ద గొయ్యి తవ్వించారు. ఆ తర్వాత కోటిన్నర విలువైన మెర్సిడెస్ బెంజ్ కారుకు అంత్యక్రియలు నిర్వహించారు. కారుకు ఎర్రటి బట్ట కప్పి, జేసీబీ సాయంతో గుంతలోకి దించి మట్టితో కప్పేశారు. దీన్ని ఎంతో మంది చూసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో ఇది వైరల్ గా మారింది.
కోటిన్నర విలువైన కారు
పాతిపెట్టిన కారు విలువ కోటిన్నర రూపాయలు కావడంతో ఈ విషయం స్థానిక అధికారులకు తెలిసింది. వెంటనే వాళ్లు స్మశానానికి చేరుకున్నారు. కారును పాతిపెట్టిన కుటుంబాన్ని పిలిపించి మాట్లాడారు. ఆ విషయం నిజమా కాదా అని తెలుసుకున్నారు.
స్మశానంలో మృతదేహాలను మాత్రమే ఖననం చేయాలి. మట్టిలో సులభంగా కలిసిపోని వస్తువులను పాతిపెట్టకూడదు. చనిపోయిన వ్యక్తి బట్టలు తప్ప, పర్యావరణానికి హాని కలిగించే ఇతర వస్తువులను పూడ్చడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. కారులోని ఇనుము, ప్లాస్టిక్ భాగాలు మట్టిలో కలవడానికి ఏళ్లు పడుతుంది. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు అధికారులు ఆ కుటుంబాన్ని మందలించారు. దీంతో ఆ కుటుంబం అధికారులకు బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ వీడియోను షేర్ చేయవద్దని.. తాము ఇప్పటికే మనిషి పోయిన బాధలో ఉన్నామని ఆ కుటుంబం ప్రజలను కోరింది.

