కేసీఆర్ ఫ్రంట్కు షాక్: స్టాలిన్ వ్యాఖ్యలివే
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకె చీఫ్ స్టాలిన్తో చేసిన చర్చలు ఫలవంతం కాలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఫ్రంట్ ఏర్పాటు విషయమై స్టాలిన్ నిరాకరించినట్టుగా సమాచారం.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై డీఎంకె చీఫ్ స్టాలిన్తో సోమవారం సాయంత్రం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చించారు. దేశంలోని రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు విషయాన్ని కేసీఆర్ చర్చించారు.
అయితే ఇప్పటికే డీఎంకె చీఫ్ స్టాలిన్తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ ఇటీవలనే సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీల కూటమిలోనే డీఎంకె ఉండేందుకు ఆసక్తిని కనబర్చినట్టుగా సమాచారం.
తమిళనాడు రాష్ట్రంలోని రాజకీ పరిస్థితుల నేపథ్యంలో డీఎంకె కాంగ్రెస్ ను వీడేందుకు ఆసక్తిని చూపలేదని సమాచారం. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 22 అసెంబ్లీ స్థానాలకు కూడ ఉప ఎన్నికలు కూడ జరిగాయి.ఈ ఎన్నికల్లో కూడ తమ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొంటుందని డీఎంకె చీఫ్ స్టాలిన్ ధీమాను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్తో కలసి తమిళనాట తాము ఎన్నికల్ని ఎదుర్కొన్న దృష్ట్యా, తమిళనాట ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం తమకు ఉందని స్టాలిన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.లోక్సభ ఎన్నికల ఫలితాల మేరకు తదుపరి చర్చిద్దామని స్టాలిన్ కేసీఆర్కు చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది.
మర్యాదపూర్వకంగానే కేసీఆర్తో సమావేశమైనట్టుగా స్టాలిన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్, డీఎంకె కూటమికి 30కు పైగా ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని స్టాలిన్ ప్రకటించినట్టుగా సమాచారం.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో డీఎంకెకు ఎక్కువ సీట్లు వస్తే అన్నాడీఎంకె ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన పరిస్థితులు నెలకొంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు డీఎంకెకు అవసరమౌతారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ లేని ఫ్రంట్ ఏర్పాటులో చేరేందుకు డీఎంకె అంతగా సుముఖంగా లేదనే ఆ ప్రచారం సాగుతోంది.
డీఎంకెకు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే ఈ తరుణంలో తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకు వెళ్లనుంది. కానీ,అదే సమయంలో జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని తమిళనాడులో రాజకీయంగా తమకు నష్టం కలిగించేలా మాత్రం డీఎంకె వ్యవహరించకపోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్చల్లో భాగంగా గత ఏడాదిలో కూడ కేసీఆర్ కరుణానిధితో చర్చించిన విషయం తెలిసిందే. కరుణానిధి మృతి చెందిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తన సత్తాను చాటాలని ఆ పార్టీ భావిస్తోంది.
కేసీఆర్తో చర్చల విషయంలో డీఎంకె చీఫ్ స్టాలిన్ ఆచితూచి అడుగులు వేశాడు. రాష్ట్రంలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు అవసరమైన వ్యూహాంతో ముందుకు సాగుతున్నాడు. దీంతో థర్ట్ఫ్రంట్ ఆలోచనకు తావు లేదని స్టాలిన్ అభిప్రాయపడుతున్నారు.