నటి ఆకాంక్ష దుబే మృతి కేసులో గాయకుడు సమర్ సింగ్ అరెస్ట్...
ప్రముఖ భోజ్పురి నటి ఆకాంక్ష దుబే అనుమానాస్పద మృతి కేసులో గాయకుడు సమర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఘజియాబాద్ : ప్రముఖ భోజ్పురి నటి ఆకాంక్ష దుబే మృతి కేసులో నిందితుడు, గాయకుడు సమర్ సింగ్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘజియాబాద్లో అరెస్టు చేసినట్లు అధికారులు ఈ రోజు తెలిపారు.
సుమారు పదిహేను రోజుల క్రితం సారనాథ్లోని హోటల్ గదిలో ఆకాంక్ష దూబే శవమై కనిపించడంతో సమర్ సింగ్, మరొక వ్యక్తిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేయబడింది.
Akanksha Dubey
ఢిల్లీ సరిహద్దులోని పశ్చిమ ఉత్తరప్రదేశ్ జిల్లా, ఘజియాబాద్లోని నంద్గ్రామ్ ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలో సమర్ సింగ్ తలదాచుకున్నాడు. స్థానిక పోలీసులు, వారణాసి నుండి వచ్చిన బృందం జాయింట్ ఆపరేషన్లో గురువారం అర్థరాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
"వారణాసి కమిషనరేట్ కిందికి వచ్చే సారనాథ్ పోలీస్ స్టేషన్కు చెందిన బృందం గురువారం అర్థరాత్రి ఘజియాబాద్కు వచ్చింది. చార్మ్స్ క్యాజిల్ (హౌసింగ్) సొసైటీలో సమర్ సింగ్ ఉన్నట్లు తమకు సమాచారం ఉందని.. అతడిని పట్టుకోవడంలో ఘజియాబాద్ పోలీసుల సహాయం కావాలని కోరారు" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఘజియాబాద్ సిటీ) నిపున్ అగర్వాల్ అన్నారు.
Akanksha Dubey
వారణాసి పోలీసు బృందం ట్రాన్సిట్ రిమాండ్ కోసం నిందితుడు సమర్ సింగ్ని ఘజియాబాద్ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డిసిపి శుక్రవారం ఉదయం తెలిపారు. ప్రముఖ భోజ్పురి నటి ఆకాంక్ష దూబే మార్చి 26న వారణాసిలోని హోటల్ గదిలో శవమై కనిపించారు. 25 ఏళ్ల నటి ఉరి వేసుకుని కనిపించింది. భదోహి జిల్లాకు చెందిన ఆకాంక్ష దూబే సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లి హోటల్లో బస చేశారు.
నటి తల్లి మధు దూబే తరఫున కేసును స్వీకరించిన న్యాయవాది శషక్ శేఖర్ త్రిపాఠి, పోస్ట్మార్టం నివేదికపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ దీనిమీద వైద్య నిపుణుల సలహా తీసుకుంటున్నానని, దాని ఆధారంగా పోలీసుల కోసం ప్రశ్నలను సిద్ధం చేస్తున్నానని చెప్పారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలని త్రిపాఠి బుధవారం డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు రాసిన లేఖలో, 25 ఏళ్ల నటి మరణం ఆత్మహత్య కాదని, హోటల్ గదిలో కొంతమంది ఆమెను చంపారని ఆరోపించారు.
పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే దహన సంస్కారాలు జరపాలని ఆమె తల్లి పట్టుబట్టినప్పటికీ ఆకాంక్ష మృతదేహాన్ని బలవంతంగా దహనం చేశారని ఆరోపించారు. భోజ్పురి పరిశ్రమలో చాలామంది తెలిసిన వ్యక్తులు దూబేని మోసం చేస్తున్నారని, ఆమె చేసిన పనికి ఆమెకు డబ్బులు ఇవ్వడం లేదని న్యాయవాది ఆరోపించారు.