ప్రధానిని కలిసిన యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. మోడీ ఏమన్నారంటే...
భారత యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. భారత యువత ఏ రంగంలోనైనా ఢంకా బజాయిస్తుందనడానికి ఉదాహరణగా ప్రజ్ఞానంద నిలుస్తారంటూ మోడీ మెచ్చుకున్నారు.
ఢిల్లీ : భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రధాని నరేంద్ర మోడీని గౌరవ సూచకంగా కలుసుకున్నారు. అత్యంత పిన్న వయసుకుడైన భారతీయ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద. అతను తల్లిదండ్రులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ఆయనతో కాసేపు గడిపారు. మీ కుటుంబంతో పాటు మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అంటూ ప్రజ్ఞానందను పొగిడారు.
ప్రధానిని కలిసిన తర్వాత ప్రజ్ఞానంద ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. గౌరవనీయులైన ప్రధానమంత్రిని ఆయన నివాసంలో కలవడం గొప్ప గౌరవం. నన్ను, నా తల్లిదండ్రులను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఆ ఫోటోలు షేర్ చేశాడు ప్రజ్ఞానంద.
ప్రజ్ఞానందగ చేసిన ట్వీట్ ను షేర్ చేస్తూ ప్రధాని.. ఈ గౌరవం మీ అభిరుచిని, పట్టుదలను తెలుపుతుంది. భారత యువత ఏ రంగంలోనైనా ఎలాంటి విజయాలు సాధించగలదో చెప్పడానికి మీరు ఉదాహరణగా నిలుస్తారు. మిమ్మల్ని చూసి మేము గర్వంగా ఉన్నాం.. అంటూ కామెంట్ చేశారు.
ఇటీవల జరిగిన చెస్ ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్ కు చేరుకున్నాడు యువ ఆటగాడు ప్రజ్ఞానందా. చెన్నైకి చెందిన ఈ ప్రతిభావంతుడైన యువ ఆటగాడు.. టైటిల్ మ్యాచ్లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సెన్ తో పోటీపడి ఓడిపోయాడు. ఈ ప్రపంచ టోర్నమెంట్లో రన్నరప్ గా నిలిచాడు. అంతకుముందు కార్ల్ సెన్ ను ఓడించిన ప్రజ్ఞనంద.. ఫైనల్ లో మాత్రం దాన్ని పునరావృతం చేయలేకపోయాడు.
రన్నరపుగా నిలిచిన ఈ యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తన ప్రతిభతో కోట్లాదిమంది భారతీయుల హృదయాలు గెలుచుకున్నాడు. ప్రజ్ఞానందా కనపరచిన ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ముగ్ధుడై ఓ బహుమతి కూడా ప్రకటించారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులైన రమేష్ బాబు, నాగలక్ష్మిలకు ఎక్స్యువి 400 ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు వారికి రెండు రోజుల క్రితం కారును అందజేశారు.