- Home
- National
- ఇంటిముందు పక్కింటి కుక్క మలవిసర్జన.. అభ్యంతరం చెప్పినందుకు వృద్ధుడిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి, చంపి....
ఇంటిముందు పక్కింటి కుక్క మలవిసర్జన.. అభ్యంతరం చెప్పినందుకు వృద్ధుడిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి, చంపి....
పక్కింటివాళ్ల కుక్కలు తమ ఇంటిముందు మలవిసర్జన చేయడాన్ని ఓ వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. దీంతో వారు అతడి మీద దాడిచేసి కొట్టి చంపారు. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగళూరు : ఇంటిముందు కుక్క మలవిసర్జన చేయించొద్దన్నందుకు ఓ 68యేళ్ల వ్యక్తిని కొట్టి చంపిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. మృతుడి ఇంటి పక్కనుండే ఓ జంట, కుక్కల శిక్షకుడైన మరో వ్యక్తి అతడి మీద దాడి చేయడంతో దెబ్బలకు తాళలేక చనిపోయాడు. మృతుడు ప్రైవేట్ సంస్థ ఉద్యోగి మునిరాజు (68). ఈ ఘటన బెంగళూరులోని సోలాదేవనహళ్లిలో జరిగింది.
ముగ్గురు నిందితులు.. రవి కుమార్ (38), పల్లవి (28), డాగ్ ట్రైనర్ ప్రమోద్ లుగా పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు మునిరాజు మీద క్రికెట్ బ్యాట్ తో దాడి చేశారు. తండ్రి అరుపులు విని కాపాడడానికి వచ్చిన మునిరాజు కొడుకు మురళి మీద కూడా వారు దాడి చేశారు. ఈ గలాటా గమనించిన స్థానికులు.. వెంటనే తీవ్రంగా గాయపడిన మునిరాజు, మురళిలను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరిద్దరికీ చికిత్స అందించారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో మునిరాజు మృతి చెందాడు. మురళికి చికిత్స నడుస్తుంది.
dog
నిందితులైన వారిలో రవికుమార్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, పల్లవి గృహిణి, ప్రమోద్ వీరింటికి రెండిళ్ల అవతల ఉంటాడు. దాడి నేపథ్యంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు సోలాదేవనహళ్లి పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా కుక్క మలవిసర్జన విషయంలోనే వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మునిరాజు దీనిమీద.. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. మరోసారి తమ ఇంటి ముందు వారి కుక్కలు గలీజ్ చేయకుండా చూడాలని కోరాడు. శనివారం ఇదే విషయాన్ని మాట్లాడడానికి వచ్చిన నేపథ్యంలోనే ఘర్షణ జరిగి హత్యకు దారి తీసిందని తెలిపారు.
"గత ఏడాది తన స్నేహితుడికి విక్రయించిన కారుకు బ్యాంకులో రుణం చెల్లించకపోవడంతో రవికుమార్, మునిరాజు కుమారుడు మురళి గొడవ పడ్డారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది. మునిరాజు తరచూ రవికుమార్పై విమర్శలు చేసేవాడు. అతని ఇంటి దగ్గర తన పెంపుడు శునకం మలవిసర్జనతో వాదన శనివారం మరో స్థాయికి చేరుకుంది" అని ఒక దర్యాప్తు అధికారి తెలిపారు.
ఈ నెల 30న మునిరాజు దంపతులు కుక్క తన ఇంటి ముందు మలవిసర్జన చేయడం, రవికుమార్, ప్రమోద్లు పొగతాగడం, బిగ్గరగా మాట్లాడడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడమని వేడుకున్నాడు. దీంతో పోలీసులు ముగ్గురిని పిలిపించి మాట్లాడారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం మునిరాజు ఇంట్లో లేడని, రవికుమార్, అతని భార్య, ప్రమోద్ తమ ఇంటి ముందు వీరంగం సృష్టిస్తున్నారని కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ వచ్చింది. ఇంటికి వెళ్లి ముగ్గురిని మునిరాజు విచారించాడు. కోపానికి వచ్చిన ప్రమోద్ ఓ దుకాణంలోకి దూసుకెళ్లి క్రికెట్ బ్యాట్ తీసి మునిరాజుపై దాడికి దిగాడు. మునిరాజును కొట్టడానికి రవికుమార్, పల్లవి ప్రమోద్ను ప్రోత్సహించారని పోలీసులు తెలిపారు. బెంగుళూరులో ఇటీవలి వారాల్లో పెంపుడు కుక్కలకు సంబంధించిన ఘర్షణ కారణంగా జరిగిన మొదటి మరణం ఇది.