భర్తతో గొడవ: ఐదేళ్ల కొడుకుతో 90 కి.మీ నడిచిన వివాహిత
అచ్చు సినిమాలో మాదిరిగానే భర్తతో గొడవపడిన భార్య ఐదేళ్ల కొడుకుతో కలిసి ఇంటి నుండి వెళ్లిపోయింది. అయితే పోలీసులు ఆమెకు రక్షణగా నిలిచారు.
:భర్తతో గొడవపడిన ఓ వివాహిత తన ఐదేళ్ల కొడుకును తీసుకొని అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకొంటూ వెళ్లింది. అయితే ఆమెను పోలీసులు గుర్తించి విచారిస్తే భర్తతో గొడవపడి వెళ్లున్న విషయం వెలుగు చూసింది.
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా గాడికొప్ప గ్రామానికి చెందిన నాగరత్న అనే వివాహిత తన భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్య మాటల యుద్దం సాగింది.
ఇక నీతోకలిసి బతకడం ఇష్టం లేదంటూ ఆమె భర్త ఇంటి నుండి ఐదేళ్ల కొడుకును తీసుకొని బయటకు వచ్చింది.
ఐదేళ్ల కొడుకును ఎత్తుకొని రోడ్డుపై నడక దారిలో తన సోదరి ఇంటికి బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా తుంబిగెరెలోని సోదరి ఇంటికి వెళ్తున్న సమయంలో శుక్రవారం నాడు అర్దరాత్రి దావణగెరెకి చేరుకొంది.
కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లాక్డౌన్ ను ప్రభుత్వం పొడిగించింది. లాక్డౌన్ సందర్భంగా రోడ్లపై ఎవరూ ఉండకుండా పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఈ సమయంలో రోడ్డుపై నాగరత్న కొడుకును తీసుకొని నడుచుకొంటూ వెళ్తూ కన్పించింది.
ఆమెను పోలీసులు ఆపి ప్రశ్నించారు. భర్తతో గొడవ పడి సోదరి ఇంటికి వెళ్తున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆమెకు, ఆమె కొడుకుకు భోజనం ఏర్పాటు చేశారు. లాక్డౌన్ కారణంగా వాహనాలు లేనందున కాలినడకన తాను సోదరి ఇంటికి వెళ్తున్నట్టుగా ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులే ఆమెకు వాహనం ఏర్పాటు చేసి సోదరి ఇంటికి పంపారు.