ఎలుకను నీటిలో ముంచి చంపిన వ్యక్తికి 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా.. ఎక్కడంటే..
నిరుడు నవంబర్లో ఎలుక తోకకు రాయిని కట్టి కాలువలో ముంచి చంపిన వ్యక్తిపై యూపీ పోలీసులు బుదౌన్ కోర్టులో 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లోని బుదౌన్లో 'ఎలుకను చంపిన' వింత ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎలుకకు పోస్ట్మార్టం చేసిన తర్వాత, ఉత్తరప్రదేశ్ పోలీసులు గతేడాది నవంబర్లో ఎలుక తోకకు రాయిని కట్టి కాలువలో ముంచి చంపిన వ్యక్తిపై బుదౌన్ కోర్టులో 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.జంతు హక్కుల కార్యకర్త వికేంద్ర శర్మ నిందితుడు మనోజ్ కుమార్పై ఫిర్యాదు చేయడంతో బుదౌన్కు చెందిన సదర్ కొత్వాలికి సంబంధించిన కేసు తెరపైకి వచ్చింది.
ఎలుకను కాపాడేందుకు తాను కాలువలో వెతికానని, అయితే అది తర్వాత చనిపోయిందని శర్మ చెప్పారు. ఆ తర్వాత అతను ఇతర జంతు ప్రేమికులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకుని నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అయితే, ఆ జిల్లాలో ఎలుకకు పోస్టుమార్టం చేసే సౌకర్యం లేదని స్టేషన్లో శర్మకు తెలిపారు. కానీ, నిందితులమీద కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. దీనికోసం ఎలుకకు పోస్ట్మార్టం చేయాలని కార్యకర్త మొండిపట్టు పట్టాడు.
అతని అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, ఎలుక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ) కేంద్రానికి పంపారు. అప్పటికే ఎలుక కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని శవపరీక్ష నివేదిక వెల్లడించింది. ఎలుక నీటిలో మునిగి చనిపోలేదని, ఊపిరాడక చనిపోయిందని కూడా పేర్కొంది.
ఎఫ్ఐఆర్ ఆధారంగా, పోలీసులు ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు, అయితే ఐదు రోజుల తర్వాత అతనికి బెయిల్ లభించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు 30 పేజీల ఛార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. ఫోరెన్సిక్ నివేదిక, మీడియాలో విడుదలైన వీడియోలు, సంబంధిత వివిధ విభాగాల నిపుణుల అభిప్రాయాలను చేర్చి ఈ చార్జిషీట్ను రూపొందించినట్లు సర్కిల్ ఆఫీసర్ (సిటీ) అలోక్ మిశ్రా తెలిపారు.
చార్జిషీట్లో, దర్యాప్తు అధికారి రాజేష్ యాదవ్, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా, కుమార్పై సెక్షన్ 11 (జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం), సెక్షన్ 429 (జంతువులను చంపడం లేదా వైకల్యం) కింద చార్జిషీట్ చేసినట్లు రాశారు.
పోస్ట్మార్టం పరీక్ష నివేదికను ఆధారం చేసుకుని ఛార్జిషీట్ లో, ఎలుకల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, వాటిలో వాపు ఉందని, కాలేయంలో ఇన్ఫెక్షన్ కూడా ఉందని పేర్కొంది. అంతే కాకుండా ఎలుకను మైక్రోస్కోపిక్ పరీక్షలో కూడా ఊపిరాడక చనిపోయిందని స్పష్టం చేశారు.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జంతు హింస చట్టం విషయంలో, రూ. 10 నుండి రూ. 2000 వరకు జరిమానా, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. సెక్షన్ 429 ప్రకారం, ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా ఉంది.
మనోజ్ కుమార్ తండ్రి మధుర ప్రసాద్ ఎలుకలను, కాకులను చంపడం తప్పు కాదని అంటున్నాడు. ఇవి హానికరమైన ప్రాణులని.. ఎలుకలు మట్టితో చేసిన పాత్రలను పాడు చేస్తున్నాయని.. మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపాడు. కోళ్లు, మేకలు చంపే వారిమీద కూడా చర్యలు తీసుకోవాలని, ఎలుకల మందు అమ్మేవారిమీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.