కొడుకుపై కోపంతో కుక్కకు సగం ఆస్తి: శునకం పేరున మధ్యప్రదేశ్ రైతు వీలునామా
కుటుంబ సభ్యులపై ఆస్తులను రాయడం మనం చూశాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ రైతు మాత్రం తన పెంపుడు కుక్కకు సగం ఆస్తి రాశాడు. కొడుకుపై కోపంతోనే ఆయన ఈ వీలునామా రాశాడని చెబుతున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైతు తన పెంపుడు కుక్కకు సగం ఆస్తి రాసిచ్చాడు. తన తర్వాత తన కుక్కను పట్టించుకోరనే భయంతో ఆయన సగం ఆస్తిని కుక్క పేరును రాశాడు.
రాష్ట్రంలోని చౌరై తహసీల్ లోని బదివారా గ్రామానికి చెందిన ఓం నారాయణ వర్మ ఒక వారం క్రితం వీలునామా రాశాడు. ఈ వీలునామా ప్రకారంగా తన వారసులుగా తన భార్య చంపాబాయి, తన పెంపుడు కుక్క జాకీని చట్టబద్దమైన వారసులుగా ప్రకటించారు
తన భార్య చంపాబాయి తనతో నివసిస్తోంది. తనను జాగ్రత్తగా ఆమె చూసుకొంటుందని ఆయన చెప్పారు. తన పెంపుడు కుక్క జాకీ కూడ తనను జాగ్రత్తగా కాపాడుతోందని ఆయన మీడియాకు చెప్పారు.
తన భార్యతో పాటు తన పెంపుడు కుక్క కూడా తనకు చాలా ప్రేమ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా ఉందన్నారు. ఒకవేళ తాను చనిపోతే తన పెంపుడు కుక్క అనాథగా మారే అవకాశం ఉందని ఆయన అనుమానించారు. తన చివరి కర్మలు కూడ భార్య, కుక్క చేయాలని వీలునామాలో రాశాడు.
తన చివరి శ్వాస వరకు తాను వీరిని జాగ్రత్తగా చూసుకొంటానని ఆయన తెలిపారు. వీలునామాలో పేర్కొన్న ఆస్తుల్లో 21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తనకు చిన్నప్పటి నుండి కుక్కలంటే చాలా ప్రేమ అని ఆయన చెప్పారు.
తాను తొలుత పెంచుకొన్న కుక్క చనిపోయిన తర్వాత తన అల్లుడి ఇంటి నుండి జాకీని తెచ్చుకొని పెంచుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు.
తన తర్వాత తన పెంపుడు కుక్కను ఎవరైతే జాగ్రత్తగా చూసుకొంటారో వారికే జాకీకి చెందిన ఆస్తి దక్కుతోందని ఆయన పేర్కొన్నాడు. ఈ వీలునామా గురించి తెలుసుకొన్న తన కొడుకు వీలునామాను రద్దు చేయాలని తనను కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ విషయమై తాను నారాయణ వర్మతో మాట్లాడినట్టుగా సర్పంచ్ జమునా ప్రసాద్ చెప్పారు. అతని సంకల్పానికి విలువ లేదని అతనితో వాదించినట్టుగా చెప్పారు.
ఈ వీలునామా కుటుంబంలో చీలికను కల్గిస్తోందని చెప్పారు. కోపంలో ఈ వీలునామాను నారాయణ రాశాడని సర్పంచ్ చెప్పారు.