ఫుల్లుగా తాగి పడిపోయిన వారిని ఇంటికి పంపించే ఏర్పాట్లు.. పోలీసుల వినూత్న నిర్ణయం
మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మందు బాబులు మాత్రం ఆ అలవాటును మానుకోరు. తాము తాగడమే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంటారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పక్కవారి ప్రాణాలను తీస్తుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొయంబత్తూరు పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తమిళనాడు అంతటా ప్రధాన వీధులలో టాస్మాక్ (ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాలు) దుకాణాలు నడుస్తున్నాయి. టాస్మాక్ దుకాణాలు పెరుగుతున్న కొద్దీ, మద్యం సేవించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. పలువురు మందు బాబులు దుకాణాల వద్ద మద్యం సేవించి, తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో వాహనాలు నడుపుతూ ప్రమాదాకాలకు కారణమవుతున్నారు.
కొయంబత్తూరులో మొత్తం 676 మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ టాస్మాక్ దుకాణాల నుంచి మద్య సేవించి వెళ్లే మందు బాబులు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన 373 మంది మరణించారనే షాకింగ్ విషయం వెల్లడైంది.
అతిగా మద్యం సేవించి నిర్లక్ష్యంగా బైక్పై వెళ్లేవారి వల్ల, మత్తులో రోడ్డుపై తూలుతున్నవారి వల్ల ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. మద్యం సేవించేవారి వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం కొయంబత్తూరు జిల్లా పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో, కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, పోలీస్ కమిషనర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. టాస్మాక్ దుకాణాల ముందు, మద్యం సేవించి మత్తులో ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిని గుర్తించి, వారిని క్యాబ్ ద్వారా ఇళ్లకు సురక్షితంగా పంపించాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పోలీసుల ఈ ఆలోచనపై కొంతసేపు ఆలోచించిన జిల్లా కలెక్టర్, ''కొయంబత్తూరు జిల్లాలో, మద్యం సేవించేవారి వల్ల ప్రమాదాల సంఖ్య పెరగకూడదు; ప్రాణనష్టం కూడా జరగకూడదు. దానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు'' అని చెప్పినట్లు సమాచారం. ఈ ప్రణాళికను అమలు చేయడంపై త్వరలో ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, నగర పోలీసుల పరిధిలోని అన్ని టాస్మాక్ దుకాణాల ముందు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని పోలీస్ కంట్రోల్ రూమ్తో అనుసంధానించాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.