ఆర్టికల్ 370పై వైఖరులు: కేసీఆర్, జగన్, బాబులకు చీలిక భయం
హైదరాబాద్: పార్టీల చీలిక భయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), వైఎస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఆర్టికల్ 370 రద్దుపై మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల పార్లమెంటు సభ్యుల్లో చీలిక రాకుండా చూసుకోవడానికి అలా చేశారని అంటున్నారు.
హైదరాబాద్: పార్టీల చీలిక భయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), వైఎస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఆర్టికల్ 370 రద్దుపై మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల పార్లమెంటు సభ్యుల్లో చీలిక రాకుండా చూసుకోవడానికి అలా చేశారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఎంపీలు చీలిపోతారనే భయం చుట్టుకుందని, దాంతో ఆర్టికల్ 370 రద్దుపై బిజెపికి అనుకూలంగా వ్యవహరించారని అంటున్నారు. ఆర్టికల్ 370 రద్దును బలపరచడం ద్వారా వైఎస్ జగన్, కేసీఆర్, చంద్రబాబు తమ రాజకీయంగా తమకు లభించిన అవకాశాలను వదులుకున్నారని తెలుస్తోంది.
ఆర్టికల్ 370ని రద్దు చేయాలని టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో డిమాండ్ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మజ్లీస్ పార్టీకి దగ్గరయ్యారు. మజ్లీస్ ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించింది. మజ్లీస్ ను దూరం చేసుకోలేక, బిజెపిని కాదనలేక టీఆర్ఎస్ మధ్యేమార్గంగా వ్యవహరించింది.
రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా టీఆర్ఎస్ వ్యవహరించింది. కానీ చర్చలో పాల్గొనలేదు. ఆ రకంగా బిజెపిని, మజ్లీస్ ను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది. రాజ్యసభలో బిజెపికి తగిన మెజారిటీ లేదు. దీంతో ఆర్టికల్ రద్దుకు ఆమోదం పొందడానికి ఇతర పార్టీల మద్దతు అవసరమైంది. లోకసభలో బిజెపికి అవసరమైనంత మెజారిటీ ఉంది కాబట్టి ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా పోయింది
రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మౌనం వహించడానికి గల కారణాలపై రెండు వాదనలు ఉన్నాయి. చర్చలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం నుంచి, అంటే కేసీఆర్ నుంచి పార్లమెంటు సభ్యులకు ఏ విధమైన ఆదేశాలు కూడా రాలేదు. ఇది ఒక వాదన కాగా, రెండో వాదన ఇలా ఉంది. ఆర్టికల్ 370 రద్దుపై చర్చలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం పార్టీ ఫ్లోర్ లీడర్ కె. కేశవరావుకు సూచించిందని, అయితే కేశవరావు అందుకు సముఖత వ్యక్తం చేయలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మోడీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు తెలపడం ద్వారా వైఎస్ జగన్ రాజకీయ తప్పిదానికి పాల్పడ్డారని అంటున్నారు. ఆర్టికల్ 370 రద్దును బలపరిచే సమయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎపికి ప్రత్యేక హోదాపై మౌనం వహించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చర్చలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేయాల్సిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బిజెపిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దును మాత్రం తెలుగుదేశం పార్టీ బలపరిచింది. తద్వారా ఎపికి ప్రత్యేక హోదాపై జగన్ ను చిక్కుల్లో పడేసే సదవకాశాన్ని చంద్రబాబు కోల్పోయారు. ఆర్టికల్ 370 రద్దును టీడీపి వ్యతిరేకించి ఉంటే రాజకీయంగా జగన్ ను చిక్కుల్లో పడేయడానికి చంద్రబాబుకు అవకాశం దక్కి ఉండేది.