అంగరంగ వైభవంగా అనంత్-రాధిక నిశ్చితార్థం.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న కొత్త జంట
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ఎంగేజ్మెంట్ కార్యక్రమం ముంబైలో ఘనంగా జరుగుతోంది. సినీ,రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరయ్యారు.
అపర కుబేరుడు , రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చెంట్లు పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వీరిద్దరి ఎంగేజ్మెంట్ ముంబైలోని అల్టా మౌంట్ రోడ్లో ఘనంగా జరుగుతోంది.
ఈ నిశ్చితార్ధాన్ని గుజరాతీ సంప్రదాయం ప్రకారం గోల్ దానాగా పిలుస్తారు. వేడుకకు హాజరయ్యే అతిథులకు బెల్లం, దనియాలను అందిస్తారు. ఈవెంట్ జరిగే స్థలంలో ఈ వస్తువులను పంపిణీ చేస్తారు. వధువు కుటుంబం బహుమతులు, స్వీట్లతో వరుడి నివాసానికి వస్తారు. ఆపై వధూవరులు ఉంగరాలు మార్చుకుంటారు. అనంతరం పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.
అనంత్ అంబానీ సోదరి ఈషా నేతృత్వంలోని అంబానీ కుటుంబ సభ్యులు .. రాధికను ఆహ్వానించడానికి ఆమె నివాసానికి వెళ్లడంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంత్, రాధికలతో కలిసి కుటుంబ సభ్యులు శ్రీకృష్ణ ఆలయానికి చేరుకుంటారు. సాంప్రదాయ లగ్నపత్రిక, వివాహా ఆహ్వాన పఠనం, గణేష్ పూజ నిర్వహిస్తారు. ప్రస్తుతం కొత్త జంట సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే.. అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చదువును పూర్తి చేసి, రిలయన్స్ ఇండస్ట్రీస్లో పలు హోదాల్లో పనిచేశారు. జియో ఫ్లాట్ఫాంలు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులతో పాటు కంపెనీ ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నాడు.
అటు శైలా, వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధిక .. 2017లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత లగ్జరీ హాలీడే హోం డెవలపర్ గ్రూపులో చేరారు. అనంతరం వారి సొంత కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తర్వాత ఎన్కోర్ హెల్త్ కేర్లో డైరెక్టర్గా మారారు. రాధిక మర్చంట్కు భరతనాట్యంలో ప్రావీణ్యం వుంది. పలు వేదికలపై ఆమె ప్రదర్శన సైతం ఇచ్చారు.