21 ఏళ్లకే మేయర్,దేశంలోనే రికార్డు: తిరువనంతపురం మేయర్ గా ఆర్య రాజేంద్రన్
కేరళ రాష్ట్రంలో సీపీఎం నాయకత్వం మరో నిర్ణయం తీసుకొంది. 21 ఏళ్ల వయస్సున్న ఆర్య రాజేంద్రన్ ను తిరువనంతపురం కార్పోరేషన్ కు మేయర్ గా నియమించనుంది.
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్ ఫ్రంట్ అధిక స్థానాలను కైవసం చేసుకొంది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో 21 ఏళ్ల వయస్సున్న ఆర్య రాజేంద్రన్ ను మేయర్ పదవికి సీపీఎం ఎంపిక చేసింది.
ఆర్య రాజేంద్రన్ మేయర్ గా బాధ్యతలు స్వీకరిస్తే దేశంలో అత్యంత చిన్న వయస్సులోనే మేయర్ గా బాధ్యతలు స్వీకరించినట్టుగా ఆర్య రాజేంద్రన్ రికార్డు సృష్టించనున్నారు.
తిరువనంతపురం సీపీఎం జిల్లా కార్యదర్శివర్గం ఆర్య రాజేంద్రన్ పేరును మేయర్ పదవికి సూచించింది. జిల్లా కమిటీ సిఫారసును సీపీఎం రాష్ట్ర కమిటీ ఆమోదించడం లాంఛనమేనని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై శనివారం నాడు సీపీఎం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
తిరువనంతపురం కార్పోరేషన్ లోని ముదవాన్ముగల్ వార్డు నుండి ఆమె విజయం సాధించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం బరిలో దింపిన అభ్యర్ధుల్లో ఆర్య రాజేంద్రన్ మాత్రమే అతి చిన్న వయస్సున్న అభ్యర్ధి.
తిరువనంతపురం కార్పోరేషన్ ను ఎల్డీఎఫ్ మరోసారి కైవసం చేసుకొంది. ఆర్య తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ గణితం చదువుతోంది. ఆమె రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు.
పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తానని ఆమె శుక్రవారం నాడు మీడియాకు చెప్పారు.
రాష్ట్రంలోని ఆరు కార్పోరేషన్లలో ఐదింటిని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కైవసం చేసుకొంది. జిల్లా పంచాయితీల్లో కూడ ఎల్డీఎప్ ఎక్కువ స్థానాలను గెలుచుకొంది.