శ్రద్ధా శ్రీనాథ్ `కలియుగమ్ 2064` మూవీ రివ్యూ
`జెర్సీ`, `డాకు మహారాజ్` వంటి చిత్రాల్లో మెప్పించిన శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ `కలియుగం 2064`. ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

kaliyugam 2064
'జెర్సీ' 'కృష్ణ అండ్ హిజ్ లీల' 'డాకు మహారాజ్' వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగులో పాపులర్ అయిన హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. ఆమె ప్రధాన పాత్రలో కిషోర్ కీలక పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ 'కలియుగమ్ 2064'. 'ఆర్.కె.ఇంటర్నేషనల్' సంస్థపై కె.ఎస్.రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోద్ సుందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం(మే 9న) తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ సినిమాని 'మైత్రి డిస్ట్రిబ్యూషన్' సంస్థ రిలీజ్ చేయడంతో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

kaliyugam 2064
కథ :
2064లో 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. ఆ తర్వాత బ్రతికున్న జనాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది? నెలల తరబడి తిండి లేక మనుషులు ఎలా అయిపోతారు. ఈ క్రమంలో బుద్ధిబలం కలిగిన వారు రెసిడెన్స్ ను ఏర్పాటు చేసుకోగా.. మిగిలిన వారు అల్ప జనాలుగా మిగిలిపోతారు. వాళ్ళ కోసం పోరాడే వాళ్ళు లిబరేటర్స్ గా ఏర్పడతారు. వీళ్ళలో ఒకడు శక్తి(కిషోర్).
ఒక రోజు ఫుడ్ క్యాన్స్ కోసం అతను , అతని టీం రెసిడెన్స్ వారి ట్రక్ పై బాంబ్ అటాక్ చేయగా...ఆ విషయం రెసిడెన్స్ వారికి తెలిసి లిబరేటర్స్ ను ఘోరంగా చంపేస్తారు. వీళ్ళలో శక్తి ఒక్కడే బ్రతికి బయటపడతాడు. అయితే అతను తీవ్రంగా గాయపడటంతో నీళ్ల కోసం, తిండి కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అతనిలానే రతి అనే అమ్మాయి కూడా తిండి కోసం, నీటి కోసం వెతుకుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఇద్దరూ ఫుడ్ క్యాన్స్ కోసం గొడవ పడతారు. చివరికి రతి.. శక్తి చేతిలో చనిపోతుంది. తర్వాత రెసిడెన్స్ కు చెందిన వారు అటాక్ చేయడంతో శక్తి పారిపోతాడు. ఈ సమయంలో అతనికి ఒక మైక్ దొరుకుతుంది. అందులో ఓ వ్యక్తి సేఫ్ హౌస్ లోకి రమ్మని చెబుతాడు. ఆ వెంటనే సేఫ్ హౌస్ కి వెళ్తాడు శక్తి.
అక్కడ ఇతనికి ఓ వ్యక్తి పరిచయమై తిండి పెడతాడు. నీళ్లు కూడా ఇస్తాడు. అతనికి మాత్రమే అంత అందమైన ఇల్లు, తినడానికి తిండి, నీరు ఎలా దొరుకుతున్నాయి. అతన్ని చంపేసి అక్కడే సెటిల్ అయిపోదాం అని శక్తి ఆలోచిస్తాడు. మరి అతని ప్లాన్ ఏమైంది? తర్వాత భూమి(శ్రద్దా శ్రీనాథ్) అదే ఇంట్లోకి ఎందుకు వచ్చింది.? ఆ సేఫ్ హౌస్ లో ఉన్న వ్యక్తి ఎవరు? అనేది మిగిలిన కథ.
kaliyugam 2064
విశ్లేషణ :
ఫస్ట్ హాఫ్ సాయి కుమార్ వాయిస్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. సినిమా సబ్జెక్ట్ ఏంటి అన్నది మొదటి 10 నిమిషాలకే ఓ క్లారిటీ వస్తుంది. కానీ తర్వాత వచ్చే సన్నివేశాలు మనకి ప్రభాస్ 'కల్కి' ని గుర్తుచేస్తాయి. కానీ ఆ సినిమాలో కంటే కూడా ఇందులోని సీన్స్ చాలా నేచురల్ గా, భయపెట్టే విధంగా ఉంటాయి. ఆ తర్వాత సినిమా ఫ్లాట్ గా వెళ్తుంది.
ఓ దశలో ఇంత బోర్ కొడుతుందేంటి.. అనుకునే టైంలో ఇంటర్వెల్ వద్ద వచ్చే ఓ ట్విస్ట్ షాకిస్తుంది. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక సెకండాఫ్ స్టార్టింగ్ పోర్షన్ బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఫ్లాట్ అవుతుంది. క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. తర్వాత మళ్ళీ కొంత ఫ్లాట్ అనిపిస్తుంది. అయితే లాస్ట్ లో ఇచ్చిన కన్క్లూజన్ బాగుంది.
kaliyugam 2064
నటీనటుల విషయానికి వస్తే..
శ్రద్ధ శ్రీనాథ్ ఎంట్రీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆమె బాగా చేసింది. లుక్స్ విషయంలో కూడా ఆమె కొత్తగా కనిపిస్తుంది. కిషోర్ పాత్ర ఫస్ట్ హాఫ్ లో ఆకట్టుకుంటుంది. అతని మెకోవర్స్, హావభావాలు అన్నీ ఆకట్టుకుంటాయి. థామస్ పాత్ర చేసిన ఇనియాన్ సుబ్రమణి కూడా ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు అనే చెప్పాలి.మిగిలిన నటీనటుల మేకోవర్ చాలా బాగుంటుంది. పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.
ఫైనల్ గా ... 'కల్కి 2064' కచ్చితంగా ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి ఇస్తుంది. అక్కడక్కడా ల్యాగ్ ఉన్నా.. టెక్నికల్ వర్క్ మాత్రం మెస్మరైజ్ చేస్తుంది. ఇలాంటి సినిమా ఓటీటీలో బాగా టైం పాస్ చేస్తుంది. థియేటర్ పరంగానూ విజువల్గా కనువిందు చేసే మూవీ అవుతుంది.
రేటింగ్ : 2.75