Psychology: సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడు ఎక్కువ ఒంటరిగా ఫీల్ అవుతాడో తెలుసా?
Psychology: చుట్టూ ఎంతమంది ఉన్నా కొందరికి మనసులో మాత్రం ఏదో చెప్పలేని వెలితి ఉంటుంది. అందరిలో ఉన్నా తీవ్రంగా ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడు ఎక్కువ ఒంటరితనాన్ని అనుభవిస్తాడో మీకు తెలుసా? మరి లేటెందుకు తెలుసుకుందాం పదండి.

మనిషి ఎక్కువ ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవుతాడు?
ఒంటరితనం అనేది కేవలం మన చుట్టూ మనుషులు లేకపోవడం వల్ల కలిగే భావన కాదు. కొంతమంది.. ఎంతమందిలో ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. సైకాలజీ నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో పెద్ద మార్పులు వచ్చినప్పుడు ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుంది. ఉద్యోగం మారడం, కొత్త సిటీకి వెళ్లడం, చదువుల కోసం ఇంటిని వదిలి వెళ్లడం, పెళ్లి తర్వాత కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టడం వంటి సందర్భాల్లో మనకు తెలిసిన వ్యక్తులు, అలవాట్లు, పరిసరాలు దూరమవుతాయి. ఈ మార్పుల కారణంగా మనిషిలో ఒంటరితనం పెరుగుతుంది.
సంబంధాలు దెబ్బతిన్నప్పుడు..
ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినప్పుడు లేదా సంబంధాలు దెబ్బతిన్నప్పుడు కూడా మనిషి తీవ్రంగా ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు, స్నేహితుడు లేదా ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు మనసులో ఒక వెలితి ఏర్పడుతుంది. ఆ ఖాళీని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. ఈ సమయంలో చాలామంది తమ బాధను ఇతరులతో పంచుకోలేక లోలోపల మౌనంగా బాధపడుతుంటారు. సైకాలజీ ప్రకారం భావోద్వేగ బంధాలు కోల్పోవడం ఒంటరితనానికి ప్రధాన కారణాల్లో ఒకటి.
ఎవరు అర్థం చేసుకోనప్పుడు..
మనిషి తన భావాలను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అనుకున్నప్పుడు కూడా ఒంటరితనం పెరుగుతుంది. కుటుంబం, స్నేహితులు లేదా సహోద్యోగులు మనతో ఉన్నప్పటికీ మన సమస్యలను, ఎమోషన్స్ ని ఎవరూ నిజంగా వినడం లేదని అనిపిస్తే మనం ఒంటరిగా ఫీల్ అవుతాం. చాలా సందర్భాల్లో ఒంటరితనం భౌతిక దూరం వల్ల కాకుండా భావోద్వేగ దూరం వల్ల వస్తుంది.
ఇది కూడా కారణమే..
నిపుణుల ప్రకారం సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూసి మన జీవితంతో పోల్చుకోవడం వల్ల కూడా కొంతమందిలో ఒంటరితనం, అసంతృప్తి పెరుగుతున్నాయి. బయటకు అందరూ సంతోషంగా కనిపిస్తున్నారనే భావన, తాము మాత్రమే సమస్యలతో ఉన్నామనే ఆలోచన మనసులో ఒంటరితనాన్ని మరింత బలపరుస్తుంది. అలాగే వృద్ధాప్యంలో ఒంటరితనం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు పనుల్లో బిజీ అయిపోవడం, స్నేహితులు దూరం కావడం లేదా ఆరోగ్య సమస్యలు పెరగడం వల్ల చాలామంది వృద్ధులు ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. యువతలో కూడా ఒత్తిడి, పోటీ, ఉద్యోగ భయం, వ్యక్తిగత సంబంధాల సమస్యల కారణంగా ఒంటరితనం పెరుగుతోంది.
ఒంటరిగా ఫీల్ కావొద్దంటే..
సైకాలజీ నిపుణుల ప్రకారం మన ఫీలింగ్స్ ని నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవడం చాలా అవసరం. మనసులో ఉన్న బాధను దాచుకోవడం కంటే బయటకు చెప్పుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులతో రెగ్యులర్ గా సమయం గడపాలి. అలాగే సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడకుండా నిజమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

