Idly: ఇడ్లీలు తింటే క్యాన్సర్ వస్తుందా.? వెలుగులోకి సంచలన విషయాలు..
ఇడ్లీలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే అలాంటి ఇడ్లీ లవర్స్కి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇడ్లీ తింటే క్యాన్సర్ వస్తుందా అంటే అవుననే అంటున్నారు అధికారులు. ఇంతకీ ఇడ్లీలకు క్యాన్సర్కు సంబంధం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఇడ్లీ.. చాలా త్వరగా రడీ అయ్యే సింపుల్ రెసపీ. అందులోనూ లైట్ ఫుడ్ కావడంతో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ప్రతీ ఒక్కరి ఇంట్లో వారంలో ఎక్కువ రోజులు ఇడ్లీనే ఉంటుంది. అలాంటి ఇడ్లీ క్యాన్సర్కు కారణమవుతుందటే నమ్ముతారా.? అయితే ఇది ఇంట్లో తినే ఇడ్లీ వల్ల కాదులేండి. బయట హోటల్స్లో ఉండే ఇడ్లీతో. నిజానికి ఇడ్లీలో ఉపయోగించే పదార్థాలు ఏవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవు. కానీ ఇడ్లీలను తయారు చేసే విధానమే క్యాన్సర్కు దారి తీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయమై తాజాగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూ రావు కీలక ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడీ అంశం దేశ్యప్తంగా చర్చకు దారి తీసింది. కర్ణాటకలోని 52 హోటల్స్లో ఇడ్లీల తయారీలో పాలిథిన్ షీట్లను ఉపయోగిస్తున్నట్లు ఆహార భద్రతా విభాగం గుర్తించింది. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ సహా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అందుకే ఈ పద్ధతిని నివారించడానికి ఆరోగ్య శాఖ ఇప్పుడు కఠినమైన నిబంధనలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ.. 'కర్ణాటక అంతటా 251 ప్రదేశాలలో ఆహార భద్రతా విభాగం ఇడ్లీ నమూనాలను సేకరించింది. గతంలో ఇడ్లీలు వండడానికి క్లాత్ (గుడ్డలు) ఉపయోగించేవారు. కానీ ఇటీవల హోటళ్లలో ప్లాస్టిక్ వాడటం ప్రారంభించినట్లు మాకు సమాచారం అందింది. కాబట్టి మా అధికారులు వివిధ ప్రదేశాలకు వెళ్లి విచారణ నిర్వహించారు" అని తెలిపారు.
251 హోటళ్లలో 52 హోటళ్లు ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నాయని తేలిందన్నారు. హోటల్ నిర్వాహకులు ఇడ్లీ తయారీ కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ను ఉపయోగించకూడదని ఆయన హెచ్చరించారు. వేడి కారణంగా ప్లాస్టిక్ ఇడ్లీల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, ఇది తిన్న వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని మంత్రి వివరించారు. ఈ విషయంలో చర్యలు ప్రారంభించామని పేర్కొంటూ, ఆహార తయారీ ప్రక్రియలో ప్లాస్టిక్ను నిషేధించడంపై స్పష్టమైన సందేశం పంపుతామని రావు అన్నారు. హోటల్ నిర్వాహకులు ఎవరైనా ప్లాస్టిక్ ఉపయోగిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి తెలిపారు.
ప్లాస్టిక్ షీట్లను ఉపయోగించి ఇడ్లీని తయారు చేయడం వల్ల క్యాన్సర్ కారకమవుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. ప్లాస్టిక్ అధిక వేడికి గురైనప్పుడు హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. కొన్ని ప్లాస్టిక్లు డయాక్సిన్లు, మైక్రోప్లాస్టిక్లను కూడా విడుదల చేస్తాయి. ఇవి కాలక్రమేణా శరీరంలో పేరుకుపోతాయి, దీనివల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు లోనైతే, ప్లాస్టిక్ క్షీణించి విషపూరిత సమ్మేళనాలను విడుదల చేస్తుంది. చూశారుగా ఇకపై బయట ఇడ్లీ తింటుంటే ఓసారి జాగ్రత్తగా చూసి తినండి.
గమనిక: ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే కేవలం బయట ప్లాస్టిక్ షీట్లలను ఉపయోగించి తయారు చేసే ఇడ్లీలతోనే ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా ఎంచక్కా ఇడ్లీలను తినొచ్చు.