Jobs : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఏకంగా 13,700 టీచర్ పోస్టులు
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా టీచర్ పోస్టులు భర్తీ జరగాల్సి ఉంది. నవోదయ స్కూళ్లలో 13,700కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది.

టీచర్ ఉద్యోగాల భర్తీ..
కేంద్రీయ విద్యాలయ (KV), జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) భారీ సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ రెండు విద్యాసంస్థల్లో కలిపి మొత్తం 13,701 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు. లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రం టీచర్ల ఖాళీలపై లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది.
కేంద్రీయ స్కూళ్లలో ఖాళీల వివరాలు
కేంద్ర మంత్రి విడుదల చేసిన డేటా ప్రకారం... కేవలం ఒక్క కేంద్రీయ విద్యాలయాల్లోనే 8,618 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జవహర్ నవోదయ విద్యాలయాల్లో 5,083 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ స్కూళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండటం విద్యావేత్తల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఖాళీలకు కారణాలేంటి?
టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటానికి మంత్రి కొన్ని కారణాలు చెప్పారు
• కొత్త స్కూళ్లు ప్రారంభించడం, ఉన్నవాటిని అప్గ్రేడ్ చేయడం.
• టీచర్ల రిటైర్మెంట్, రాజీనామాలు, ప్రమోషన్లు.
• విభాగాల వారీగా బదిలీలు.
విద్యార్థుల అడ్మిషన్లు, అవసరాలకు తగ్గట్టుగా టీచర్ల నియామకం జరగకపోవడమే ఈ గ్యాప్కు ప్రధాన కారణమని తెలుస్తోంది.
త్వరలోనే ఖాళీల భర్తీ
ప్రస్తుతం ఉన్న టీచర్ల కొరత వల్ల విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా, ఖాళీ పోస్టుల్లో తాత్కాలిక (కాంట్రాక్టు) టీచర్లను నియమించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు ఈ కాంట్రాక్టు టీచర్లే క్లాసులు తీసుకుంటారు. అయితే ఈ ఖాళీలను భర్తీ చేయడం అనేది నిరంతర ప్రక్రియ అని, నిబంధనల ప్రకారం వీలైనంత త్వరగా నింపేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు.
విద్యా ప్రమాణాలపై ప్రభావం ఉంటుందా?
టీచర్ల కొరత ఉన్నప్పటికీ, పబ్లిక్ పరీక్షల్లో కేంద్రీయ విద్యాలయ, నవోదయ స్కూల్ విద్యార్థులు సాధిస్తున్న అద్భుతమైన ఉత్తీర్ణత శాతమే విద్యా ప్రమాణాలు బాగున్నాయని చెబుతోందని మంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పర్మినెంట్ టీచర్లను త్వరగా నియమించడానికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన పార్లమెంటులో తెలిపారు.

