నెట్టింట్లో ఇక గట్టి రూల్స్: ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ బ్యాన్ అంటగా..
మీరు విన్నది నిజమే… కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ పై నిషేధం విధించబడింది. ఇలా ఎక్కడ, ఎందుకు బ్యాన్ చేశారో ఇక్కడ తెలుసుకొండి.

నేపాల్ పాలకులు అన్నంతపని చేశారుగా...
ఈ టెక్ జమానాలో స్మార్ట్ ఫోన్ అనేది మనిషి నిత్యావసర వస్తువుల్లో చేరిపోయింది... చిన్నారులు, కొంతమంది పెద్దవాళ్లు మినహా దాదాపు అందరిదగ్గర మొబైల్ ఉంటోంది... ఇందులో అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. భారతదేశంలో జనాభా కంటే ఫోన్లే ఎక్కువగా ఉంటాయట... దీన్నిబట్టే వీటికి జనాలు ఎంతలా అలవాటుపడ్డారో అర్థమవుతోంది. స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు... అందులో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటివి ఉంటాయి. వీటికి అలవాటుపడినవారు ఫోన్ ను వదిలిపెట్టలేకపోతున్నారు.
ఈ సోషల్ మీడియా వాడకాన్ని చూసి ఇవి లేకుంటే ప్రపంచంలో మనుషులు బ్రతకలగరా? అనే అనుమానం కలుగుతుంది. అయితే చాలామందికి తెలియని విషయం మనదేశంలో వాడుతున్నంతగా ఎక్కడా సోషల్ మీడియాను వాడరు... చాలాదేశాలు పరిమితంగానే వీటిని ఉపయోగించుకునేందుకు అనుమతిస్తాయి. మరికొన్నిదేశాలయితే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ పై నిషేదం విధించాయి. ఇందులో ఇప్పుడు మన పొరుగు దేశం నేపాల్ కూడా చేరింది.
నేపాల్ లో సోషల్ మీడియాను ఎందుకు బ్యాన్ చేశారు?
ఇటీవల నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది... తమ దేశంలో సేవలను అందించాలంటే తప్పకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ కమ్యూనికేషన్ ఆండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి... ఇందుకోసం గడువు విధించింది. అయితే ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు ప్రభుత్వ రూల్స్ ను పట్టించుకోకుండా రిజిస్టర్ చేసుకోలేవు. దీంతో అన్ రిజిస్టర్ సైట్లపై నిషేధం విధిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది... గురువారం అర్ధరాత్రి నుండి దీన్ని అమలు చేసినట్లు సమాచారం.
రిజిస్టర్ చేసుకోని కంపెనీలపై చర్య
సోషల్ మీడియా సైట్స్ పై నిషేధం విధించడం గురించి నేపాల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ ప్రిత్వి సుబ్బా గురుంగ్ వివరణ ఇచ్చారు. తమ దేశంలో బాగా ఫేమస్ అయిన దాదాపు 25 సోషల్ మీడియా కంపెనీలకు రిజిస్టర్ చేసుకోమని నోటీసులు పంపించామని... ఈ ఆదేశాలు పాటించకుండా రిజిస్టర్ చేసుకోని వాటిని వెంటనే బ్యాన్ చేశామని చెప్పారు. అయితే టిక్టాక్, వైబర్, ఇంకా మూడు సోషల్ మీడియా సైట్లు ప్రభుత్వ రూల్స్ ప్రకారం రిజిస్టర్ చేసుకున్నాయి కాబట్టి అవి ఇంకా నడుస్తున్నాయని తెలిపారు.
సోషల్ మీడియాపై ఆంక్షల కోసం ప్రత్యేక బిల్లు
సోషల్ మీడియా సైట్లను సరిగ్గా మేనేజ్ చేయడానికి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్లను శిక్షించడానికి ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రజల స్వేచ్ఛను హరిస్తుందని... ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్లను శిక్షించడానికి ఇది ఒక ఉపాయం అని చాలామంది తప్పుబడుతున్నారు. ఇది ప్రజల మాటలను అణచివేయడానికి, వాళ్ల హక్కులను కాలరాయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని పౌరహక్కుల గురించి పోరాడే సంస్థలు అంటున్నాయి.
నేపాల్ ప్రభుత్వం ఏమంటోంది?
సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి, ప్రజలు, కంపెనీలు పోస్ట్ చేసే అంశాలకు వాళ్లే బాధ్యత వహించాలని చెప్పడానికి ఈ రూల్స్ అవసరం అని నేపాల్ అధికారులు అంటున్నారు. కానీ దీన్ని చాలామంది తప్పుబడుతున్నారు. అలాగే తమ దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు...సోషల్ మీడియా కంపెనీలు నేపాల్ లో కార్యాలయాలు ఏర్పాటుచేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఇలాంటి ప్రతిపాదనలు కూడా ఈ కొత్త బిల్లులో ఉన్నాయని చెబుతోంది.