- Home
- International
- Social Media: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం.. చట్టం తీసుకొస్తున్న అక్కడి ప్రభుత్వం.
Social Media: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం.. చట్టం తీసుకొస్తున్న అక్కడి ప్రభుత్వం.
సోషల్ మీడియా విస్తృతి ఓ రేంజ్లో పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగింది. చిన్న పిల్లలు కూడా ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అయితే సోషల్ మీడియాతో ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 16 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించేందుకు న్యూజిలాండ్ అడుగులు వేస్తోంది.

న్యూజిలాండ్ ఎంపీ కొత్త బిల్లును ప్రతిపాదించారు. న్యూజిలాండ్లో నేషనల్ పార్టీకి చెందిన ఎంపీ క్యాథరిన్ వెడ్ (Catherine Wedd) ఒక కొత్త బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లు ప్రకారం, 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వయసు ధృవీకరణ తప్పనిసరి:
ఈ బిల్లు కింద, సోషల్ మీడియా కంపెనీలు వాడుకదారుల వయసు ధృవీకరించాల్సి ఉంటుంది. వయస్సు తక్కువగా ఉన్న పిల్లలు ఖాతా (account) సృష్టించకుండా చూసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన సోషల్ మీడియా సంస్థలపై ఆర్థికంగా కఠినమైన చర్యలు తీసుకుంటారు. కంపెనీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని బిల్లులో స్పష్టం చేశారు.
పిల్లలను రక్షించేందుకే చట్టం:
ఈ బిల్లు గురించి క్యాథరిన్ వెడ్ మాట్లాడుతూ – “ఇది ఒక రాజకీయ విషయం కాదు. ఇది న్యూజిలాండ్ దేశానికి సంబంధించిన అంశం. పిల్లలను బుల్లీయింగ్, అసభ్య కంటెంట్, సోషల్ మీడియా వ్యసనాల నుంచి రక్షించేందుకే ఈ చట్టం.” అని చెప్పారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. అవసరమైతే ఈ బిల్లును ప్రభుత్వ బిల్లుగా మార్చి వేగంగా పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఆస్ట్రేలియాలో ఇప్పటికే అమల్లో ఉంది.
ఈ బిల్లు ఆస్ట్రేలియాలో ఇప్పటికే అమలులో ఉన్న చట్టాన్ని అనుసరించి రూపొందించారు. ఆస్ట్రేలియాలో 2024 నవంబరులో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించే చట్టం అమలైంది. ఆ చట్టం ప్రకారం, వయస్సు పరిమితిని అమలు చేయాల్సిన బాధ్యత పిల్లలపై కాదు, సోషల్ మీడియా కంపెనీలపైనే ఉంటుంది.
ఈ చట్టాన్ని పాటించని కంపెనీలకు AU$ 50 మిలియన్ (సుమారు ₹270 కోట్లకు పైగా) వరకు జరిమానా విధించవచ్చు. చట్టం అమలైన 3 సంవత్సరాల తర్వాత ప్రభావాన్ని సమీక్షించి మళ్లీ పునరాలోచన చేస్తారు.