పాక్ చెత్త: సానియాతో రెస్టారెంటుకు, షోయబ్ మాలిక్ ఖేల్ ఖతమ్
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ చెత్తగా ఓడిపోవడం ఆ దేశం క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు. తమ జట్టు కెప్టెన్ కు బుర్ర లేదని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య పాకిస్తాన్ జట్టుపై ఎంత ఆగ్రహం పెల్లుబుకుతోందో తెలియజేస్తోంది.
ఇస్లామాబాద్: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ చెత్తగా ఓడిపోవడం ఆ దేశం క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు. తమ జట్టు కెప్టెన్ కు బుర్ర లేదని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య పాకిస్తాన్ జట్టుపై ఎంత ఆగ్రహం పెల్లుబుకుతోందో తెలియజేస్తోంది. మరో వెటరన్ క్రికెటర్ వకార్ యూనిస్ కూడా పాకిస్తాన్ జట్టుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సర్ఫరాజ్ ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ ను తప్పు పట్టారు. సర్ఫ్రాజ్ అయోమయానికి గురయ్యాడని ఆయన వ్యాఖ్యానించారు. వాహబ్ రియాజ్ బౌలింగ్లో షార్ట్ మిడ్ వికెట్లో ఫీల్డర్ను ఉంచాడని, షాదాబ్ఖాన్ బౌలింగ్లో స్లిప్లో ఫీల్డర్ను పెట్టాడని ఆయన తప్పు పట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో లెగ్ స్పిన్నర్కు బంతిపై పట్టు దొరకడం కష్టమని, పాక్ జట్టులో ఊహాశక్తి కొరవడిందని. ఆలోచన విధానంలోనే లోపం ఉందని వ్యాఖ్యానించాడు.
టాస్ గెలిచి పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడాన్ని కూడా తప్పు పడుతున్నారు. మ్యాచ్ కు ముందు తమ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన సలహాను కూడా పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పెడ చెవిన పెట్టాడు. ఇమ్రాన్ ఖాన్ కేవలం ప్రధాని మాత్రమే కాదు, పాకిస్తాన్ కు ప్రపంచ కప్ ను అందించిన జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఇమ్రాన్ ఖాన్ ఆ సలహా ఎందుకు ఇచ్చారో కూడా సర్ఫరాజ్ ఆలోచించలేదని చెప్పవచ్చు.
షోయబ్ అక్తర్ సర్ఫరాజ్ పై తీవ్రంగా మండిపడ్డాడు. పాకిస్థాన్ ఛేదనలో బలహీనమని తెలిసి కూడా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడని, తమ బలం బౌలింగ్ అని బ్యాటింగ్ కాదని అన్నాడు. 1999లో మంచి బ్యాట్స్మెన్ ఉన్నా 227 పరుగులను ఛేదించలేకపోయామని ఆయన గుర్తు చేస్తూ అలాంటిది టాస్ గెలిచిన సర్ఫ్రాజ్ ఏమాత్రం బుర్ర వాడకుండా బౌలింగ్ తీసుకున్నాడని మండిపడ్డాడు.
జట్టు ఎంపిక బాగా లేదని, సరైన ప్రణాళికే లేదని, ఆటలో జయాపజయాలు సహజమని, కానీ పోరాడకుండానే తలొగ్గడం దారుణమని పాక్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ అన్నాడు. ఈ మ్యాచ్లో తమ కెప్టెన్, ఆటగాళ్ల దేహ భాష కూడా సరిగా లేదని ఆయన అన్నాడు. రెండేళ్ల కిందట ఛాంపియన్స్ ట్రోఫీలో టాస్ గెలిచిన కోహ్లి పాకిస్థాన్కు బ్యాటింగ్ ఇచ్చి తప్పు చేశాడని, ఇప్పుడు సర్ఫ్రాజ్ అదే పని చేశాడని మరో మాజీ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ అన్నాడు.
జట్టులో అంతర్గతం విభేదాలున్నాయని, సర్ఫ్రాజ్కు వ్యతిరేకంగా జట్టులో కొందరు ఆటగాళ్లు గ్రూపులు కట్టారని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సర్ఫ్రాజ్ కెప్టెన్గా ఉండటమే వీరికి ఇష్టం లేదని అన్నాడు. భారత్తో మ్యాచ్లో సర్ఫ్రాజ్ అవుటై డ్రెస్సింగ్ రూంకు వచ్చిన అనంతరం ఆ ఆటగాళ్లపై చిందులు తొక్కాడని మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
భారత్తో మ్యాచ్లో ఆడిన తొలి బంతికే ఔటైన షోయబ్ మాలిక్ తీవ్ర విమర్సలకు గురవుతున్నాడు. 37 ఏళ్ల మాలిక్ను ప్రపంచకప్కు ఎంపిక చేయడంపై ఇంతకు ముందే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అతను ఈ టోర్నీలో ఏ మాత్రం సత్తా చాటలేకపోయాడు.
ప్రాక్టీస్ మీద దృష్టిపెట్టకుండా మ్యాచ్కు ముందు సానియా మీర్జాతో కలిసి రెస్టారెంటుకు వెళ్లాడు. దీనిపై అతను తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కున్నాడు. మ్యాచ్లో వైఫల్యంతో మరింతగా అతనిపై విమర్సలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచకప్ తర్వాత రిటైరవుతానని షోయబ్ మాలిక్ ముందే సంకేతాలు ఇచ్చాడు. ఇక టోర్నీలో అతను మరో మ్యాచ్ ఆడే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. భారత్తో ఆడిందే మాలిక్ కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చునని చెబుతున్నారు.