కరోనా వేళ దీపావళి సంబరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
ఈ కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న ఈ సమయంలో.. పండగ సంబరాలను జరుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికీ నచ్చే పండుగలలో దీపావళి మొదటి స్థానంలో ఉంటుంది. ఇళ్లంతా దీపాలతో అలంకరించడం మొదలు.. సాయంత్రం వేళ వెలుగులు జిమ్మే కాకరపువ్వత్తులు, మతాబులు కాలుస్తూ పండగని మరింత ఆనందంగా జరుపుకుంటారు. అందుకే.. దీపావళి వస్తుందంటే చాలు ఆనందంతో పొంగిపోతుంటారు.
అయితే.. ఈసారి కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ఇప్పటికే ఓ వైపు మహమ్మారి కబలిస్తోంది. ఇలాంటి సమయంలో.. దీపావళి పండగ చేసుకోవడం అవసరమా అని పలువురు భావిస్తున్నారు.
దీపావళి నాడు కాల్చే పటాసుల కారణంగా కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని అంతేకాకుండా.. ఆ పొగను పీల్చడం వల్ల మరిన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో.. ఈ కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న ఈ సమయంలో.. పండగ సంబరాలను జరుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో మనమూ ఓసారి చూసేద్దామా..
1. పండగ అనగానే... మనకు కావాల్సిన వారందరితోనూ కలిసి జరుపుకోవాలని చాలా మంది ఆశపడతారు. అయితే.. ఇది కరోనా సమయం అన్న విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.
అలా అని ఎవరూ లేకుండా.. నిర్జీవంగా పండగ చేసుకోమని కూడా చెప్పడం లేదు. కాకపోతే.. మరీ ఎక్కువ మంది కాకుండా..కుటుంబసభ్యులు.. బాగా క్లోజ్ అయిన వారి మధ్య జరుపుకోవాలని చెబుతున్నారు.
2. ఆ సమయంలో కూడా వీలైతే మాస్క్ లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అందరితో కలిసి ఉన్నప్పుడు కూడా సామాజిక దూరం పాటిస్తూ.. శానిటైజర్ వాడుతూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
3.రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, బాగా క్లోజ్ గా ఉండే ప్రదేశాల్లో తిరగకుండా ఉండటమే మంచిది. బంధువులతో కలిసి కూర్చున్న సమయంలోనూ ఇంట్లోకి బాగా వెంటిలేషన్ వచ్చేలా చూసుకోవాలి.
4.బయట పార్టీలు, డిన్నర్ లకు ఈ ఒక్క ఏడాది స్వస్తి చెప్పి.. ఇంట్లో మీకు నచ్చిన వంటలను వండుకొని తింటే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. మరీ కాదంటే.. ఫుడ్ ఇంటికి ఆర్డర్ ఇచ్చుకొని.. ఇంట్లోనే సరదాగా భోజనం చేయడం కొంతలో కొంత క్షేమంగా ఉండొచ్చు.
5.చాలా రోజుల తర్వాత కలిశాం కదా అనే ఆనందంలో కౌగిలింతలు ఇచ్చుకోకండి. ఈ విషయంలోనూ కొంత కంట్రోల్ లో ఉండటం ఉత్తమం. పండగ శుభాకాంక్షలు కూడా చేతులు జోడించి చెప్పడం సంప్రదాయంగానూ.. ఆరోగ్యానికి ప్రయోజనకరంగానూ ఉంటుంది.
6. శానిటైజర్ వాడమన్నారు కదా అని.. దీపాలు, కొవ్వత్తులు వెలిగించేటప్పుడు మాత్రం వాటిని వాడకూడదు. ఎందుకంటే.. శానిటైజర్ లో ఉన్న ఆల్కహాల్ కి నిప్పు తగిలితే.. మంటలు పెద్ద ఎత్తున చెలరేగే ప్రమాదం ఉంది.
7. ఇక ఈ దీపావళికి కరోనా కారణంగా పటాసులు కాల్చవద్దని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే.. కాలుష్యానికి హాని చేయని గ్రీన్ క్రాకర్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని కాల్చుకొని పండగ ఆనందాన్ని పెంచుకోవచ్చు. అవి కూడా ఎక్కువగా కాకుండా మితిగా కాల్చుకుంటే మంచిది.