ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకి కరోనా వచ్చే అవకాశం తక్కువ!
మనుషుల బ్లడ్ గ్రూప్ ని బట్టి కూడా కరోనా సోకే అవకాశం ఉందని తాజాగా నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. మన దేశంలోనూ కరోనా కేసులు విపరీతంగా నమోదయ్యాయి. గత నెల వరకు రోజుకి కనీసం లక్ష కేసులు కూడా నమోదయ్యాయి. ఈ మధ్య కాస్త కేసుల తాకిడి తగ్గింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య తక్కువగా ఉండి.. రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగించింది.
కాగా.. ఈ మహమ్మారి గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మనుషుల బ్లడ్ గ్రూప్ ని బట్టి కూడా కరోనా సోకే అవకాశం ఉందని తాజాగా నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది.
తాజాగా బ్లడ్ అడ్వాన్స్స్ జర్నల్లో కొత్తగా ప్రచురించబడిన రెండు అధ్యయనాల ప్రకారం ‘ఓ’ బ్లడ్ గ్రూప్కు చెందిన వ్యక్తులకు కరోనా వైరస్ తక్కువగా సోకుతుందని తేలింది. అంతేకాదు ఒకవేళ వీరికి కరోనా సోకినా.. తక్కువ రిస్క్ ఉంటుందని.. తొందరగా కోలుకుంటున్నారని పరిశోధనలో స్పష్టమైంది.
ఈ అధ్యయనానికి సంబంధించి పరిశోధకులు డెన్మార్క్లోని కోవిడ్ 19 సోకిన సుమారు 4,73,000 మందిపై విడివిడిగా పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో టైప్ ‘ఓ’ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు తక్కువ సంఖ్యలో కరోనా బారిన పడితే.. టైప్ ‘ఏ’, ‘బీ’, ‘ఏబీ’ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్టు తెలిసింది.
మరోవైపు టైప్ ‘ఏ’, ‘ఏబీ’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. అది శరీరంలోని వివిధ అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుందని స్టడీ చెబుతోంది.
అత్యధిక మరణాలు కూడా ఈ బ్లడ్ గ్రూప్స్ కలిగిన వ్యక్తుల్లోనే సంభవిస్తాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అందుకే ‘ఏ’, ‘ఏబీ’ బ్లడ్ గ్రూప్స్ కలిగిన వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.