Gold History: ప్రపంచంలోనే మొదట బంగారు నగలు ధరించింది ఎవరు?
Gold History: బంగారం అత్యంత విలువైన లోహంగా మారిపోయింది. బంగారు ఆభరణాలు వేసుకోవడం మహిళలకు ఎంతో ఇష్టం. అయితే చరిత్రలో బంగారాన్ని ఆభరణాల రూపంలో ఎవరు వేసుకున్నారు? బంగారు ఆభరణాల చరిత్ర ఏమిటి?

ప్రపంచంలోనే ప్రాచీన బంగారు నగలు
బంగారం విపరీతంగా రేటు పెరిగిపోయింది. పెళ్లిళ్లు వచ్చాయంటే బంగారం విపరీతంగా కొంటారు. బంగారు ఆభరణాలను మనదేశంలోనే కాదు ఎన్నో దేశాల్లో ఇష్టంగా కొంటారు. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో మొదటిసారిగా బంగారు ఆభరణాలు ఎవరు వేసుకున్నారు? చరిత్ర ఏం చెబుతోందో తెలుసుకోండి. మనిషి బంగారాన్ని ఎప్పటి నుంచి ఆభరణాలుగా వేసుకుంటున్నాడనే ప్రశ్నకు చాలా ఏళ్లుగా స్పష్టమైన సమాధానం లేదు. కానీ తూర్పు ఐరోపాలోని బల్గేరియాలోని వర్ణా నగరంలో దొరికిన అరుదైన నిధి మాత్రం చరిత్రను కొత్తగా చూపించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన బంగారు నగలు ఇక్కడే దొరికాయని పరిశోధకులు చెబుతున్నారు. దీని ప్రకారం మనుషులు వేల ఏళ్ల క్రితమే బంగారాన్ని ఆభరణాలుగా వాడారని, వాటిని అధికారానికి చిహ్నంగా చూసేవారని తెలుస్తోంది. దీన్ని బట్టి వర్ణా ప్రాంతంలోని ప్రజలు తొలిసారి బంగారు నగలను వేసుకుని ఉంటారని చారిత్రకారులు భావిస్తున్నారు.
పురాతన బంగారు నిధి
1972లో బల్గేరియాలోని నల్ల సముద్ర తీరంలో నిర్మాణ పనులు జరుగుతుండగా కార్మికులు కొన్ని పురాతన సమాధులను కనిపెట్టారు. దీంతో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు చేశారు. అప్పుడు వందలాది సమాధులు బయటపడ్డాయి. అవి సాధారణ స్మశానం కాదు. ఇక ప్రాచీన కాలంలో ఒక సమాజం ఇక్కడ జీవించేది. వారి జీవనశైలి, నమ్మకాలను చూపించే చారిత్రక ఆనవాళ్లు ఇక్కడ లభించాయి. ఈ సమాధులు క్రీ.పూ. 4600 నుంచి 4300 కాలం నాటివని పరిశోధనల్లో తేలింది. అంటే సుమారు 6,000 ఏళ్లకు పైగా పురాతనమైనవి. ఆ కాలంలో నివసించిన ప్రజలకు బంగారం కరిగించి రకరకాల ఆకారాలను తయారుచేసేవారు. చాలా సమాధుల్లో పూసలు, కంకణాలు, అలంకరణ వస్తువులు బంగారంతో చేసినవి దొరికాయి.
ఎక్కువ బంగారు నగలు ఉంటే..
ఒక్కో సమాధిలో ఒక్కో రకంగా బంగారు ఆభరణాలు ఉన్నాయి. కొన్ని సమాధుల్లో ఎక్కువగా, కొన్ని సమాధుల్లో తక్కువగా బంగారం లభించింది. ఒక సమాధిలో ఎక్కువ బంగారు నగలు ఉంటే ఆ వ్యక్తి ఉన్నత హోదాకు చెందిన వ్యక్తి అని అర్థం. దీన్ని ప్రాచీన కాలంలో జీవించిన వారిలో కూడా సమానత్వం లేదు. సంపద, అధికారం కొందరి చేతుల్లోనే ఉండేవి. కొన్ని సమాధులు సంపద చిహ్నాలతో నిండి ఉండగా, మరికొన్ని ఖాళీగా ఉన్నాయి. ఇది ఆ కాలంలోనే సామాజికంగా కూడా ప్రజలు విడిపోయిన జీవించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ అరుదైన నగలు వర్ణా పురావస్తు మ్యూజియంలో భద్రపరిచారు. ఈ నగలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది సందర్శకులు వస్తున్నారు.

