Free Cycle Scheme : ఆధార్ కార్డు ఉంటే చాలు ఫ్రీగా ఎలక్ట్రిక్ సైకిల్? ఇందులో నిజమెంత?
పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేయనుందా..? ప్రధాని మోదీ ఇప్పటికే ఇలాంటి స్కీమ్ గురించి ఏమైనా ప్రకటన చేశారా..?

ఫ్రీగా ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ ప్రచారం..
Fact Check : వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్ విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి, చదువును ప్రోత్సహించడానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా సైకిల్స్ పంపిణీ చేశాయి గత ప్రభుత్వాలు. అయితే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ సమస్య నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఎలక్ట్రిక్ సైకిల్స్ పంపిణీ చేయనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ EV సైకిల్స్ పంపిణీ ప్రకటన చేసినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇది నిజమో లేక తప్పుడు ప్రచారమో తెలియక ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు.

సైకిళ్ల పంపిణీ పథకం నిజమేనా..?
''మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు... కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిల్ అందిస్తుంది'' అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని PIB (Press Information Bureau) క్లారిటీ ఇచ్చింది. కొందరు ప్రధాని మోదీ మాట్లాడుతున్నట్లుగా AI వీడియోను క్రియేట్ చేశారని... సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది నిజమైన వీడియో కాదని తెలిపింది. ప్రధాని మోదీ గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ ప్రకటన చేయలేదని పిఐబి స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని... కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ myscheme.gov.in ను చూడాలని PIB సూచించింది. ఏదైనా తప్పుడు ప్రచారం కనిపిస్తే ఫోన్ నెంబర్ +91 8799711259 లేదా ఈమెయిల్ factcheck@pib.gov.in ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించింది PIB.
🚨 सावधान!#Facebook अकाउंट ‘Dealdukaaan99’ द्वारा प्रधानमंत्री @narendramodi के एक AI-जनरेटेड वीडियो के माध्यम से यह दावा किया जा रहा है कि सभी आधार कार्ड धारकों को इलेक्ट्रिक साइकिल दी जाएगी।#PIBFactCheck
❌ यह दावा फर्जी है।
✅ प्रधानमंत्री या केंद्र सरकार द्वारा ऐसी कोई… pic.twitter.com/4CNIUDFt4m— PIB Fact Check (@PIBFactCheck) May 25, 2026
సైకిళ్ళ పంపిణీ ప్రచారం ఎలా మొదలయ్యింది..?
ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు దాడులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హర్ముజ్ జలమార్గం వద్ద ఆందోళనకర పరిస్థితులు, యుద్ద వాతావరణం కారణంగా ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఇండియాలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది... వీటి ధరలు కూడా రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి.
ఈ ఇంధన సమస్యలు, అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలు పొదుపు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించుకోవాలని... అనవసరంగా వాడవద్దని ప్రజలను కోరారు. ఈ మాటలే ప్రస్తుతం ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ అంటు జరుగుతున్న ప్రచారానికి కారణమయ్యాయి. పెట్రోల్, డీజిల్ సమస్య లేకుండా ప్రజలు ఎలక్ట్రిక్ సైకిళ్లు వాడేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది... అందుకే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ వీటిని ఉచితంగా పంపిణీ చేయనుందని ప్రచారం మొదలయ్యింది.
ప్రధాని మోదీ ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ ప్రకటన చేసినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన రూపొందించిన వీడియోను చూసి చాలామంది నిజమేనని నమ్ముతున్నారు. అందుకే PIB స్పందించి ఇది తప్పుడు ప్రచారం అని వివరణ ఇచ్చింది. ఇలాంటి స్కీమ్ ఏదీ కేంద్ర ప్రభుత్వం అమలుచేయడంలేదని తెలిపింది. ఇలాంటి ప్రచారాలు నమ్మి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని సూచించింది.

