మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ ఆత్మహత్యలు చూడబోతున్నారు.. సోనూ నిగమ్
బాలీవుడ్ ఇండస్ట్రీలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సుశాంత్ మరణంతో ఇండస్ట్రీలోని చీకటి కోణాలు తెర మీదకు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో అదే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నవారు కూడా ఇప్పుడు నెపొటిజం మీద స్పందిస్తున్నారు.
సుశాంత్ మరణం వెనుక చాలా కారణాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నెపోటిజం కారణంగా కొంత మంది ఇండస్ట్రీ పెద్దలు సుశాంత్ ఎదుగుదలను అడ్డుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నారు.
సుశాంత్ మరణం తరువాత సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, ఎక్తా కపూర్, యష్ రాజ్ ఫిలింస్ లాంటి వారి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర రంగాలలోనూ నెపొటిజంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
తాజాగా ఈ విషయంపై ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ స్పందించాడు. సంగీత పరిశ్రమలోనూ నెపోటిజం తీవ్ర స్థాయిలో ఉందని ఆరోపించాడు సోనూ నిగమ్. మ్యూజిక్ ఇండస్ట్రీలో మాఫియా కారణంగా యువ గాయకులతో పాటు లిరిసిస్ట్లు, సంగీత దర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపాడు సోనూ.
ఇండస్ట్రీలో కేవలం రెండు కంపెనీలు మాత్రమే దశాబ్దాలుగా సంగీత పరిశ్రమను ఏళుతున్నాయని, ఎవరు పాడాలి, ఎవరు పాడకూడదు అన్న విషయాలను కూడా వారే డిసైడ్ చేస్తున్నారని చెప్పాడు సోనూ నిగమ్.
అంతేకాదు సుశాంత్ లాగే మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా చాలా మరణాలు సంభవించే అవకాశం ఉందని సోనూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీలోని మాఫియా కారణంగా సంగీత పరిశ్రమలో చాలా మంది కళాకారులు ఆత్మహత్యలు చేసుకుంటారన్నాడు సోనూ నిగమ్.
సోనూ కామెంట్స్తో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇప్పటికే హీరోయిన్ల విషయంలో వేదింపులు హీరోలకు అవకాశాలు దూరం చేయటం లాంటి ఇబ్బందులు తెర మీదకు రావటం తాజాగా సంగీత కళాకారులకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్టుగా తెలియంటంతో మరిన్ని రంగాల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చని భావిస్తున్నారు.