- Home
- Entertainment
- Vishwambhara Budget: `విశ్వంభర`పై భారీ రిస్క్ చేసిన మేకర్స్.. తేడా కొడితే అడ్రస్ గల్లంతే
Vishwambhara Budget: `విశ్వంభర`పై భారీ రిస్క్ చేసిన మేకర్స్.. తేడా కొడితే అడ్రస్ గల్లంతే
చిరంజీవి హీరోగా నటించిన `విశ్వంభర` మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ వివరాలను వెల్లడించారు ఛోటా కెనాయుడు. కానీ ఇదే అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన చిరంజీవి
చిరంజీవి ఇటీవలే `మన శంకర వర ప్రసాద్ గారు`తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇది ఏకంగా రూ.300కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. టాలీవుడ్ రీజినల్ మూవీస్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిందని చెప్పొచ్చు. అదే సమయంలో చిరంజీవికి సాలిడ్ మూవీ పడితే అది బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్లో వసూళ్లని రాబడుతుందో నిరూపించింది. మెగాస్టార్ స్టామినా ఏంటో చాటి చెప్పింది. జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రధానంగానే రూపొందిన మూవీనే ఈ స్థాయిలో వసూలు చేస్తే, అదే మైథాలజీ, సోషియో ఫాంటసీ లాంటి చిత్రాలు చేస్తే ఆ లెక్కలు చెప్పడం కష్టమే.
సీజీ వల్ల డిలే అవుతోన్న `విశ్వంభర`
ఇదిలా ఉంటే చిరంజీవి ఇప్పుడు `విశ్వంభర` చిత్రంలో నటించారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో త్రిష హీరోయిన్గా నటించింది. మరికొందరు హీరోయిన్లు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. ఒక సాంగ్ చిత్రీకరణ చేయాల్సి ఉందని టాక్. ఇదిలా ఉంటే సీజీ వర్క్ వల్ల సినిమా డిలే అయ్యింది. మొదట ఒక కంపెనీకి ఇస్తే, అది సరిగా చేయలేదని, తర్వాత మరో కంపెనీకి ఇచ్చినట్టు సమాచారం. ఇలా రెండు సార్లు కంపెనీలు మారాయని, ఇప్పటికైతే బాగానే వచ్చినట్టు సమాచారం.
రిలీజ్కి రెడీ అవుతున్న `విశ్వంభర`
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు దర్శకుడు వశిష్ట. త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. జులై 10న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఆ లోపు మూవీ కాపీ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ రివీల్ అయ్యింది. సినిమాకి దాదాపు రెండు వందల కోట్ల వరకు అయ్యిందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు షాకిచ్చే బడ్జెట్ ని లీక్ చేశాడు సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు. దీనికి ఏకంగా రూ.400కోట్లు అయినట్టు వెల్లడించారు.
`విశ్వంభర`కి తలదించుకొని పనిచేస్తున్న ఛోటా కె నాయుడు
గతంలో చిరంజీవితో `అంజి` సినిమాకి తలెత్తుకొని పనిచేశామని, ఇప్పుడు తలవంచుకొని పని చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు సీజీ ప్రభావం పెరిగిందని, సీజీ టెక్నీషియన్ లేకుండా తాము షూటింగ్ చేయడం లేదని, వాళ్లు చెప్పినట్టు తాము పనిచేయాల్సి వస్తుందని, దీంతో తలవంచుకుని వర్క్ చేస్తున్నట్టు తెలిపారు కెమెరామెన్ ఛోటా కె నాయుడు. సినిమాకి సీజీ చాలా ఇంపార్టెంట్గా మారిందని వెల్లడించారు. ఇప్పుడు చాలా మంది దర్శకులకు కెమెరా ఎలా పెట్టాలి, లైటింగ్ ఎలా పెట్టాలనేది తెలియడం లేదని, తాము చెప్పినా వినడం లేదన్నారు. సినిమా బాగా రాకపోతే తమపైనే తోస్తున్నారని, అందుకే తలవంచుకుని, దర్శకుడు చెప్పినట్టు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే `విశ్వంభర` మూవీకి కూడా తలదించుకుని చేశామన్నారు.
విశ్వంభర బడ్జెట్ లీక్
ఇప్పుడు సీజీ టెక్నీషియన్ కి తెలియకుండా ఒక్క ఫ్రేమ్ కూడా తీయడం లేదన్నారు. విశ్వంభరకి చాలా పీక్లో సీజీ వర్క్ ఉంటుందని, అక్కడికి వెళ్లి నేను ఛోటా కె నాయుడు, అది ఇది అంటూ నడవదు, ఎందుకంటే ఆ సినిమా వెనకాల నాలుగు వందల కోట్లు ఉంది. అక్కడికి వెళ్లి నా ఈగో చూపిస్తే నడవదు అని అన్నారు కెమెరామెన్. ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో `విశ్వంభర`కి నాలుగు వందల కోట్లు బడ్జెట్ పెట్టడం ఆశ్చర్యపరుస్తోంది. చిరంజీవిపై ఇంతటి భారీ బడ్జెట్ పెట్టడం షాక్కి గురి చేస్తోంది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోల మీదనే ఈ స్థాయి బడ్జెట్ వర్కౌట్ కావడం లేదు. చాలా రేర్ కేసులోనే ఇది సాధ్యమవుతుంది. అలాంటిది ఇప్పుడు `విశ్వంభర`కి ఈ స్థాయి బడ్జెట్ పెట్టడం ఆశ్చర్యంగా మారింది.
`విశ్వంభర`తో పెద్ద రిస్క్ చేస్తోన్న నిర్మాతలు
అసలే సినిమాపై విభిన్నమైన ప్రచారం జరుగుతుంది. ఔట్ పుట్ తేడా కొట్టిందనే ప్రచారం కూడా ఉంది. అందుకే సినిమాని పక్కన పెట్టారని అంటున్నారు. సినిమా ఆడితే ఫర్వాలేదు, కానీ తేడా కొడితే మాత్రం నిర్మాతల అడ్రస్ గల్లంతు అని చెప్పొచ్చు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ బ్యానర్లో ఇటీవల విజయాలు లేవు. వరుసగా పరాజయాలే ఉన్నాయి. వారి హోప్స్ అంతా `విశ్వంభర`పైనే. సినిమా ఆడితే గట్టెక్కుతారు. లేదంటే అడ్రస్ గల్లంతే అనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

