రెమ్యూనరేషన్ విషయంలో భానుమతికి మోసం.. ఎన్టీఆర్కి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన నటి..
లెజెండరీ నటీమణి భానుమతి అంటే అప్పట్లో అందరికి హడల్. కానీ ఆమెని బురిడీ కొట్టించాలనుకున్నాడు ఎన్టీఆర్. ఆమె ఇచ్చిన ఝలక్కి మైండ్ బ్లాక్ అయ్యిందట.
తెలుగు తెరపై మొదటితరం నటీమణుల్లో భానుమతి ఒకరు. అప్పట్లోనే ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ లకు ధీటుగా రాణించిన నటి. ఇంకా చెప్పాలంటే లేడీ సూపర్ స్టార్గా అని పిలవొచ్చు. లెజెండరీ నటుల్లో నిలిచే భానుమతి అప్పట్లోనే ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ధీటుగా పారితోషికాలు కూడా తీసుకునేది. కేవలం నటిగానే కాదు, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో హోనర్గా, సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, రైటర్గా రాణించింది. మల్టీటాలెంటెడ్, జీనియన్ యాక్ట్రెస్ అని అంతా ప్రశంసించేవారు. అందుకే ఆమె సూపర్ స్టార్స్ ని మించిన ఇమేజ్ని సొంతం చేసుకుంది.
భానుమతితో అంటే అంతా వణికిపోయేవాళ్లు. అందులో ఎన్టీఆర్, ఎస్వీఆర్లు కూడా ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఓ సందర్భంలో భానుమతిని బురిడి కొట్టించాలనుకున్నారు ఎన్టీఆర్. ఇద్దరు కలిసి చేస్తున్న సినిమాకి పారితోషికం విషయంలో కుట్ర చేశారు. ఆమెకి తక్కువ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో విషయం తెలుసుకుని ఎన్టీఆర్కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందట భానుమతి.
ఎన్టీఆర్, భానుమతి మధ్య జరిగిన ఓ గమ్మత్తైన విషయాన్ని పంచుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎస్వీ రామారావు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ అరుదైన విషయాలను షేర్ చేసుకున్నారు. భానుమతి అంటే అందరికి ఎలా దడ ఉండేదో చెబుతూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు. ఎన్టీఆర్, భానుమతి కలిసి `తాతమ్మ కల` చిత్రంలో నటించారు. ఇందులో బాలకృష్ణ, హరికృష్ణ కూడా నటించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీకి డీవీ నరసరాజు రైటర్.
ఇందులో భానుమతిని బామ్మ పాత్రకి తీసుకున్నారు. ముసలయ్యగా ఎన్టీఆర్ నటించారు. ఆయన డబుల్ రోల్ చేశారు. సినిమా జరుగుతుంది. పారితోషికం విషయాలు చర్చకు వచ్చాయి. భానుమతికి ఎంత పారితోషికం ఇవ్వాలనేది చర్చ. రైటర్ వెళ్లి భానుమతిని పారితోషికం గురించి అడిగారు. దీంతో ఆమె.. ఎన్టీఆర్కి ఎంత పారితోషికం ఇస్తారో అందులో ఐదు వేలు తగ్గించి ఇవ్వండి అని తెలిపింది.
ఈ విషయాన్ని ఎన్టీఆర్ వద్ద చెప్పారు రైటర్ నరసరాజు. దీంతో ఎలాగైనా భానుమతిని బురిడీ కొట్టించాలని ప్లాన్ చేశారు. ఎన్టీఆర్కి రెండు లక్షల పారితోషికం ఇస్తున్నారని చెప్పి, లక్షా తొంబై ఐదు వేల చెక్ రాసి పంపించారట. అది చూసిన భానుమతి.. ఆ అమౌంట్కి మరో ఐదు వేలు కలిపి రెండు లక్షలు చేసి ఆమె నెక్ట్స్ మూవీ `అమ్మాయి పెళ్లి`లో ఆయన్ని యాక్ట్ చేయమని చెప్పండి అని అన్నదట. దెబ్బకి ఇటు నరసరాజుకి, అటు ఎన్టీఆర్కి ఫ్యూజులు ఎగిరిపోయాయట.
భానుమతి దెబ్బకి మైండ్ బ్లాక్ అయిన ఎన్టీఆర్ సచ్చినట్టు `అమ్మాయి పెళ్లిలో` అదే పారితోషికానికి నటించాల్సి వచ్చిందట. మాట చెప్పాం కదా, అసలు విషయం తెలిస్తే దొరికిపోతారు, పరువు పోతుందని, దీంతో మరో మాట లేకుండా ఆ సినిమాలో ఎన్టీఆర్ నటించాడట. అది భానుమతి దెబ్బ, ఆమెతో పెట్టుకుంటే అలా ఉంటుందని జర్నలిస్ట్ ఎస్వీరామారావు వెల్లడించారు. ఆమెతో పెట్టుకుంటే అంతే అని, అందుకే ఎవరూ ఆమెని టచ్ చేసే సాహసం చేసేవాళ్లు కాదని తెలిపారు.
ఎన్టీఆర్, భానుమతి కలిసి ఎన్నో సినిమాలు చేశారు. ఇద్దరు జోడీగా నటించారు. అలాగే ఎన్టీఆర్కి అమ్మగా, బామ్మగా, ఇలా విభిన్న పాత్రల్లో ఆమె నటించి మెప్పించింది. వందకుపైగా సినిమాల్లో నటించింది. తెలుగులో సినిమాకి దర్శకత్వం వహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఆమె భారతీయ సినిమాకి అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది. అలాగే ఆమె పేరుతో పోస్టల్ స్టాంప్ని కూడా విడుదల చేయడం విశేషం.