దుమారం రేపుతున్న `ఉప్పెన` క్లైమాక్స్.. సోషల్ మీడియాలో అనుకున్నదే నిజమైంది
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు రూపొందించిన `ఉప్పెన` చిత్రం క్లైమాక్స్ అంతా ఊహించినట్టుగానే ఉంది. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగానే ఉంది. అదే సమయంలో కథ కూడా చాలా రొటీన్గా ఉంది. దీంతో సినిమాపై, ముఖ్యంగా క్లైమాక్స్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో సినిమా ఎండింగ్ పెద్ద దుమారం రేపుతుంది.
పరువు హత్య కేసులు మనం అనేకంగా వింటుంటాం. పరువు హత్యలు ఇప్పటికీ సమాజంలో జరుగుతూనే ఉంటున్నాయి. మిర్యాలగూడ సంఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు అనేక సంఘటనలు ఇటీవల కాలంలో జరిగాయి. పరువు హత్యలపై సినిమాలు కూడా వచ్చాయి. మరాఠిలో వచ్చిన `సైరత్` కూడా అలాంటిదే. ఈ సినిమాల్లో అంతిమంగా ప్రేమని చంపేయడం. ప్రేమికులను చంపేయడం, గొప్పింటి అమ్మాయిలను ప్రేమించిన, పెళ్ళి చేసుకున్న అమ్మాయిలను చంపేయడం చూస్తుంటాం.
తాజాగా విడుదలైన `ఉప్పెన` చిత్రం కూడా అలాంటి కథతోనే రూపొందింది. పరువు హత్య కథతోనే తెరకెక్కిన చిత్రమిది. ఊరు పెద్ద అయిన విజయ్ సేతుపతి కూతురిని పేద అయిన, తక్కువ కులానికి చెందిన వైష్ణవ్ తేజ్ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తాడు. అందుకు కక్ష్య గట్టిన విజయ్ సేతుపతి చివర్లో హీరో మర్మాంగాలు కట్ చేస్తారు.
జనరల్గా ఏ సినిమాలో అయినా హీరోహీరోయిన్లనిగానీ, హీరోనిగానీ చంపేయడం చూపించారు. ఇందులో అలా చేస్తే రొటీన్ అవుతుందని కేవలం హీరో మర్మాంగాలు కట్ చేయడమే కొత్తగా చూపించారు.
అయితే దీనిపై అనేక రకాలుగా చర్చ జరుగుతుంది. మొదటి నుంచి సోషల్ మీడియాలో అనుకున్నట్టుగానే ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ క్లైమాక్స్ గురించి, హీరోయిన్ తండ్రి, హీరో మర్మాంగాలు కట్ చేస్తారనేదే క్లైమాక్స్ అని సోషల్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది.
ఇంకా ఇందులో విచిత్రమేంటంటే తనకు శరీరంతో సంబంధం లేదు, ఆ సుఖంతో సంబంధం లేదు, ప్రేమ, మనసే ముఖ్యం. అందుకు హీరోతోనే ఉండిపోతాను, అతని ప్రేమ చాలు అని హీరోయిన్ చెప్పే డైలాగ్లు ఆశ్చర్యానికి షాక్కి గురి చేస్తున్నాయి. క్లైమాక్స్ కొత్తగా ఉందనే ప్రశంసలు కూడా వస్తున్నాయి.
సినిమాటిక్గా ఇది చాలా గొప్పగా ఉందనే ప్రశంసలు దక్కుతున్నా, ప్రాక్టీకల్ సమాజంలో అది ఎంత వరకు సాధ్యమనేది కొత్త చర్చ నడుస్తుంది. భార్యాభర్త, అబ్బాయి,అమ్మాయికి ప్రేమ, మనసు సరిపోతుందా? అంతకు మించిన ఆనందం, ఆ.. సుఖం అవసరం లేదా? అనే ప్రశ్నలు ఉదహిస్తున్నాయి. సమాజంలో ఇది సాధ్యం కాదనే వాదని వినిపిస్తుంది.
అదే సమయంలో ఈ క్లైమాక్స్ సమాజాన్ని పెడదారి పట్టించేదిగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. మన సమాజంలో తమ గొప్పింటి అమ్మాయిని ప్రేమించిన ప్రేమికుడిని ఇప్పటి వరకు చంపుతూ వస్తున్నారు. ఇకపై `ఉప్పెన` సినిమాలో చూపించినట్టు చేసే అవకాశాలున్నాయని, ఇలా కూడా చేయొచ్చనే తప్పుడు సమాచారం అందించినట్టుగా ఈ సినిమా ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎక్కడో ఓ చోట జరిగిన సంఘటన ఆధారంగా చేశామని మేకర్స్ చెబుతున్నా, ఇప్పుడు సినిమాతో దాన్ని అందరికి తెలిసేలా చేసినట్టు అవుతుందని, భవిష్యత్లో పరువు హత్యల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా ఆశ్చర్యం లేదనే విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఇది ఎలాంటి టర్న్ లు తీసుకుంటుంది, దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారనేది చూడాలి. కానీ చిత్ర బృందం మాత్రం ఈ రొటీన్ సినిమాని సక్సెస్గా భావిస్తున్నారు. దర్శకుడు తొలి చిత్రంతోనే హిట్ కొట్టారని సంబరాలు చేసుకోవడం గమనార్హం.