20 ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
హీరోయిన్లు ఒక్క సారి పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత ఫ్యామిలీకే పరిమితం అవుతుంటారు. కొంత మంది మాత్రమే రీ ఎంట్రీలు ఇస్తూ.. సందడి చేస్తుంటారు. దాదాపు 20 ఏళ్ల తరువాత తెరపైకి వచ్చిన ఓహీరోయిన్.. వరుస ఆఫర్లతో అదరగొడుతోంది.

20 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ?
టాలీవుడ్లో హోమ్లీ ఇమేజ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ లయ. చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె.. రీ ఎంట్రీ ద్వారా మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత ఆమె కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.
నటుడు శివాజీతో కలిసి ఆమె నటించిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో లయ తన రీఎంట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మొదటిసారి విలన్ పాత్రలో..
ఈ సినిమాలో తాను ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా కనిపించబోతున్నట్లు లయ తెలిపారు. గతంలో ఎక్కువగా హోమ్లీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె, ఈ సినిమాలో మాత్రం ‘ఉత్తర’ అనే స్వార్థపరురాలైన భార్య పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. కథలో ఈ పాత్ర చాలా కీలకమని, భర్త పాత్రలో నటించిన శివాజీని ఇబ్బందులకు గురిచేసే విధంగా కథ ముందుకు సాగుతుందని వివరించారు. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని విధంగా ఈ పాత్ర ఉంటుందని ఆమె తెలిపారు.
లయకు వరుసగా ఆఫర్లు..
సెకండ్ ఇన్నింగ్స్లో తాను కేవలం ఎమోషనల్ పాత్రలకే పరిమితం కావాలని భావించడం లేదని లయ స్పష్టం చేశారు. మంచి కథలతో పాటు బలమైన పాత్రలు ఉంటే తప్పకుండా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పాత్ర చిన్నదైనా, కథలో ప్రాధాన్యం ఉంటే ఆ అవకాశం స్వీకరిస్తానని చెప్పారు.
ప్రస్తుతం లయ మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు వెల్లడించారు. అందులో ఒకటి నటుడు జగపతిబాబుతో కలిసి చేస్తున్న ‘వదలా’ అనే సైకలాజికల్ థ్రిల్లర్. అలాగే శ్రీకాంత్తో కలిసి ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు.
ఈటీవీ విన్ తో పాటు శివాజీ నిర్మించిన సినిమా..
ఈటీవీ విన్ తో పాటు శివాజీ సంయుక్తంగా నిర్మించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందిస్తుందని మూవీటీమ్ నమ్మకం వ్యక్తం చేసింది. ఈ సినిమాతో లయ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

