స్టార్ హీరోల చేతుల్లోకి థియేటర్లు.. మహేష్ బాబు నుంచి రవితేజ వరకు మల్టీప్లెక్స్ దందా షురూ..
స్టార్ హీరోలు థియేటర్ రంగంలోకి వస్తున్నారు. థియేటర్లని తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. మహేష్ బాబు నుంచి రవితే, వెంకీ వరకు ఒక్కొక్కరుగా ఈ రూట్ ఎంచుకుంటున్నారు.
సినిమా హీరోలు అంటే వెండితెరపై నటిస్తూ మ్యాజిక్ చేసేవాళ్లు. తమదైన నటనతో ఆడియెన్స్ ని అలరించేవాళ్లు. వాళ్లకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు, వారిని నమ్మే కోట్లు పెడుతున్నారు నిర్మాతలు. వారిని నమ్మే కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు దర్శకులు. ఇలా ప్రతిదీ వారి బేస్గానే నడుస్తుంది. ఆడియెన్స్ కూడా చాలా వరకు హీరోలను చూసే సినిమాకి వస్తుంటారు.
హీరో అంటే నటనకే పరిమితం కావడంలేదు. ఇతర రంగాల్లోనూ రాణిస్తున్నారు. చాలా కాలంగా హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఈ ట్రెండ్ సాగుతుంది. మధ్యలో కొంత బ్రేక్ వచ్చినా మళ్లీ ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు ప్రొడక్షన్లో భాగమవుతున్నారు. మహేష్ బాబు ప్రొడ్యూసర్గా మారి చాలా సినిమాలు నిర్మించారు. అలాగే చిరంజీవికి ప్రొడక్షన్ ఉంది. అల్లు అర్జున్కి హోం బ్యానర్ ఉంది. ప్రభాస్ కి యూవీ ఉంది. రవితేజ ఈ మధ్యనే స్టార్ట్ చేశాడు. వెంకటేష్కి హోం బ్యానర్ ఉంది.
దీంతోపాటు థియేటర్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఒకప్పుడు హీరోలు, నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వెర్వేరుగా ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోలు కూడా ఎగ్జిబిటర్లుగా మారుతున్నారు. థియేటర్లు నిర్మిస్తూ నెమ్మదిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని తమ వశం చేసుకుంటున్నారు. మున్ముందు తమ సినిమా తమ థియేటర్లలోనే రిలీజ్ అవుతాయనే కాంపీటీషన్కి పునాదులు వేస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్లన్నీ ఆ నలుగురి చేతుల్లోనే ఉన్నాయని, తమకు థియేటర్లు ఇవ్వడం లేదని చిన్న నిర్మాతలు వాపోయేవారు. మీడియా వద్దకు వచ్చి తమ గోడు వెల్లబోసుకునేవాళ్లు. ప్రస్తుతం ఎక్కువగా థియేటర్లు దిల్రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏసియన్ నిర్మాతల వద్ద ఉండేవి. కానీ ఇప్పుడు నెమ్మదిగా హీరోలు ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. థియేటర్లని మల్టీఫ్లెక్స్ చేస్తున్నారు. హీరోలు థియేటర్ రంగంలోకి వస్తున్నారు. వీరందరికి ఒక్కరే థియేటర్ పార్టనర్ కావడం విశేషం.
మహేష్ బాబు మొదటగా థియేటర్ రంగంలోకి వచ్చారు. ఆయన కొండాపూర్లోని శరత్ సిటీ మాల్లో మల్టీప్లెక్స్ నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబిటర్, నిర్మాత ఏషియన్ పార్టనర్గా మహేష్ బాబు థియేటర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. వారితో కలిసి ఏఎంబీ(ఏషియన్ మహేష్ బాబు) మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇది మన ఇండియాలోనే అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన థియేటర్ కావడం విశేషం. దీనికి ప్రస్తుతం విశేషంగా డిమాండ్ ఉండి. ఏ క్లాస్ ఆడియెన్స్ దీనికి క్యూ కడుతున్నారు. అంతేకాదు బెంగుళూరులోనూ ఓ థియేటర్ నిర్మిస్తున్నారు మహేష్.
ఆ తర్వాత అల్లు అర్జున్ ఈ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన అమీర్ పేటలోని సత్యం థియేటర్ స్థానంలో నిర్మించిన మాల్లో ఏషియన్ సినిమాస్తో కలిసి `ఏషియన్ అల్లు అర్జున్`(ఏఏఏ)ని నిర్మించారు. ప్రస్తుతం ఇది కూడా బాగా నడుస్తుంది. ఇది కూడా అత్యధునిక టెక్నాలజీతో, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించడం విశేషం. దీంతోపాటు నెమ్మదిగా మరికొన్ని థియేటర్లు కూడా మాడిఫికేషన్లో ఆయన భాగం అయ్యేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారట.
మహేష్బాబు, బన్నీని చూసి విజయ్ దేవరకొండ థియేటర్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్లో ఏషియన్ వాళ్లతోనే కలిసి `ఏవీడీ`(ఏషియన్ విజయ్ దేవరకొండ) పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇది కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. మరికొన్ని మల్టీప్లెక్స్ ల్లో ఆయన భాగం కాబోతున్నారు.
ప్రభాస్ కూడా థియేటర్ దందా చేస్తున్నారు. ఆయన తన హోం బ్యానర్ అయినటువంటి యూవీ క్రియేషన్స్ పేరుతో థియేటర్ నిర్మించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ తో కూడిన మల్టీప్లెక్స్ ని నిర్మించారు. వీ సెల్యూలాయిడ్ పేరుతో దీన్ని నిర్మించారు.
వీరితోపాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆయన బ్యాక్ టూ బ్యాక్ రెండుమూడు థియేటర్లలో భాగం కాబోతున్నారట. దిల్సుఖ్ నగర్లో వెంకటాద్రి థియేటర్ స్థానంలో మల్టీఫ్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ఏషియన్ వాళ్లతో కలిసి ఏషియన్ రవితేజ(ఏఆర్టీ) పేరుతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. మరోవైపు వనస్థలిపురంలో కొత్తగా ఓ మాల్ నిర్మిస్తున్నారు. అందులో మల్టీప్లెక్స్ కూడా ఏషియన్తో కలిసి ఏఆర్టీ థియేటర్ నిర్మిస్తున్నారు రవితేజ. మరికొన్నింటిలో ఆయన భాగం కానున్నారు.
ఇదిలా ఉంటే.. వెంకటేష్ కూడా ఈ మల్టీప్లెక్స్ వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే అన్న సురేష్ బాబుకి చాలా థియేటర్లు ఉన్నాయి. కానీ మల్టీప్లెక్స్ లు లేవు. వెంకీ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు ఏషియన్ సినిమాస్ వాళ్లతోనే కలిసి మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సుదర్శన్ థియేటర్ చాలా ఫేమస్. దాన్ని కూల్చీ ఆస్థానంలో మల్టీ ప్లెక్స్ నిర్మించబోతున్నారు. అయితే మహేష్ బాబు, వెంకీ, ఏసియన్ వాళ్లు కలిసి ఏఎంబీ విక్టరీ పేరుతో దీన్ని నిర్మించనున్నారట. ఇలా హీరోలంతా థియేటర్ రంగంలోకి వస్తూ నెమ్మదిగా మల్టీప్లెక్స్ లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. వాళ్లే ఎగ్జిబిటర్లు గా మారబోతున్నారు. ఒకేసారి మూడు నాలుగు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎవరి థియేటర్లో వాళ్లు తమ సినిమాలను ప్రదర్శించుకునే పరిస్థితి వస్తుందేమో చూడాలి.