Emotional: ఈ పాట వింటే.. బండరాయి లాంటి మనిషి కంట కూడా నీరు రావాల్సిందే..!
Emotional: పాటలు సినిమాకి ప్రాణం పోస్తాయి. పాటల కారణంగానే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే.. కొన్ని పాటలు మాత్రం మన జీవితానికి అద్దం కడతాయి. మన మనసులను మెలిపెట్టేసి, గుండెకు హత్తుకునేలా ఉంటాయి. అలాంటి ఓ పాట ఇది.
కన్నీళ్లు పెట్టించే పాట...
తెలుగు సినీ సంగీత ప్రపంచంలో కొన్ని పాటలు కేవలం వినడానికి కాదు, మనం అనుభూతి చెందడానికి కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో అగ్ర స్థానంలో నిలిచే పాట ‘మాతృదేవో భవ’ చిత్రంలోని ‘ రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకే.. తోటమాలి నీ తోడు లేడులే’ ఈ పాట విన్న ప్రతిసారీ మనసు భారమవ్వని తెలుగు వాడు ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పాట వెనక కథ..
క్యాన్సర్ తో మరి కొద్ది రోజుల్లో మరణించనున్న ఓ తల్లి.. తన తర్వాత తన నలుగురు చిన్న పిల్లల పరిస్థితి ఏమౌతుందో అని తల్లడిల్లిపోయే సందర్భంలో సాగే పాట ఇది. మరణం తథ్యమని తెలిసినా, తన పిల్లలను వదిలి వెళ్లలేక ఆమె పడే నరకాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అక్షరాల్లో బంధించారు.
పాటలోని ప్రతి లైనూ ఒక అద్భుతమే...
"రేపు అన్నది చీకటై నిను మింగేస్తుంటే.. నిన్న అన్నది నేటితో కలగా మిగిలితే"
"దేవుడే లేడన్నది చేదు నిజం.. ఉన్నాడనుకోవడం ఒక భ్రమ"
అమ్మ పడే బాధను రాలిపోయే పువ్వుతో పోల్చిన విధానం అమోఘం. జీవితం ముగిసిపోతున్న వేళ, ఎవరూ తోడు రారని తెలిసినప్పుడు కలిగే నిస్సహాయతను ఈ పాట అద్దం పడుతుంది.
బాలు గాత్రం.. కీరవాణి మ్యూజిక్..
ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతుంటే, ఆ గొంతులో ఉండే వణుకు, ఆ ఆవేదన వింటుంటే మనకు తెలియకుండానే కళ్లు చెమర్చుతాయి. ఎం.ఎం. కీరవాణి గారు కూర్చిన ఆ విషాద భరితమైన ట్యూన్, ఈ పాటను తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ఎమోషనల్ క్లాసికల్ గా నిలపెట్టింది.
సినిమాకు హైలెట్ క్లైమాక్స్...
ఈ పాట సినిమా క్లైమాక్స్ లో వస్తుంది. తల్లి తన బిడ్డలను దత్తత ఇచ్చేసిన తర్వాత అందరినీ చివరిసారిగా కలుస్తున్న సమయంలో వచ్చే పాట ఇది. థియేటర్ లో ఈ పాట చూసి ఏడ్వని వారు ఎవరూ ఉండరు.
ఈ రాలిపోయే పువ్వా పాట కేవలం సినిమా పాట కాదు... అది మాతృత్వానికీ ఒక నివాళి. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, ఆ అమ్మ దూరం అవుతుంటే కలిగే బాధ ఎలా ఉంటుందో ఈ పాట నిరూపించింది. ఈ పాట ఇప్పటికీ ఎక్కడ వినిపించినా? టీవీలో చూసినా.. కచ్చితంగా కళ్లల్లో నీళ్లు తిరగాల్సిందే.

