నా అంతు చూస్తామన్నారు.. సల్మాన్ సినిమాపై కంగన సంచలన ఆరోపణ
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య సృష్టించిన ప్రకంపనలు బాలీవుడ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ మాఫియా కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతడికి ఓకే అయిన ప్రాజెక్ట్స్ నుంచి కూడా తప్పించారని ఆ వేదనతోనే సుశాంత్ మరణించాడన్నప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వివాదాస్పద నటి కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేస్తోంది.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ గత నెల 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. తన ఆత్మహత్యకు కారణాలను సుశాంత్ వెల్లడించకపోయినా.. వరుసగా సినిమా అవకాశాలు చేజారటంతో తీవ్ర మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యంగా వివాదాస్పద నటి కంగనా రనౌత్, సుశాంత్ మృతిపై సంచలన ఆరోపణలు చేస్తోంది. తాజాగా మరోసారి ఇండస్ట్రీ పెద్దలపై విరుచుకుపడింది కంగనా. బాలీవుడ్ మాఫియా తనను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలనుకుందని, తన కెరీర్ను నాశనం చేయాలనుకుందని సంచలన ఆరోపణలు చేశారు కంగనా రనౌత్..
ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది కంగనా. మూవీ మాఫియా తన మీద మూకుమ్మడి దాడి చేసిందని చెప్పింది కంగనా. ఆర్ధికంగా మానసికంగా వేదించటంతో పాటు తన మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించింది. 2016లో తన మాజీ బాయ్ ఫ్రెండ్ పెట్టిన కేసు కూడా ఈ కుట్రలో భాగమే అని చెప్పింది.
తన పై కేసులు వేయటంతో చాలా వ్యాపార ప్రకటనలు వదులుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఓ దుర్మార్గులానని ప్రచారం చేశారని అవన్నీ తట్టుకోలేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని చెప్పింది.
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమాలో ముందుగా హీరోయిన్గా తనను అనుకున్నారని, అయితే నేను ఆ ఆఫర్ను రిజెక్ట్ చేయటంతో ఆకాష్ చోప్రా నీ అంతూ చూస్తా అంటూ బెదిరించాడని వెల్లడించింది. మూవీ మాఫియా వల్ల నా లైఫ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పింది కంగనా.