హైదరాబాద్లో జరిగిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగాన్ని ప్రోత్సాహిస్తున్నదని ప్రశంసించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కళాకారులను ప్రోత్సాహించాలని చంద్రబాబును కోరారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుక హైదరాబాద్ లో గురువారం రోజు ఘనంగా జరిగింది. ఈ వేడుకకి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరికొందరు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అదే విధంగా గద్దర్ అవార్డ్స్ లో చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, జయసుధ లాంటి సినీ ప్రముఖులు సందడి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు
ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కళాకారులని గౌరవించే రాజ్యం, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుంది అని నానుడి ఉంది. దానిని సీఎం రేవంత్ రెడ్డిగారు అర్థం చేసుకుని నిజం చేస్తున్నారు. సినిమా ప్రభావం ఎంత ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి బాగా అర్థం చేసుకున్నారు. అందుకే సినిమా రంగాన్ని ప్రోత్సాహిస్తున్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు.
తెలుగు సినిమా సమస్యలని అడిగి తెలుసుకుంటున్నారు. చర్చించి పరిష్కరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మన సంస్కృతి, కళలని ప్రోత్సాహిస్తోంది. సినిమాకి ఒక దేశ ఎకానమీని పెంచే శక్తి ఉంది. ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్ గుర్తుకు రావాలి అనే విధంగా రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు అంటూ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.
అదే క్రమంలో ఏపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది సందర్భమో అసందర్భంలో తెలియదు.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కళాకారులని, సినిమాని ప్రోత్సాహించడంలో వెనుకబడింది. ఈ స్టేజీపై నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వస్ట్ చేస్తున్నా. ఏపీ కూడా తెలంగాణ నుంచి స్ఫూర్తి పొంది కళాకారులని ప్రోత్సాహించేలా అవార్డులు ఇవ్వాలి అని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు.


