ఎగిరెగిరి పడితే ఇలానే ఉంటుంది.. `లైగర్` రిజల్ట్ పై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `లైగర్` చిత్రం విడుదలై నెగటివ్ టాక్ని తెచ్చుకుంటున్న నేపథ్యంలో తాజాగా సినిమా ఫలితంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయ్ దేవరకొండ నటించిన `లైగర్` మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ `లైగర్` సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగిరెగిరి పడితే అనుభవాలు ఇలానే ఉంటాయని, ఆడియెన్స్ రియాక్షన్ ఇలానే ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ్మారెడ్డి భరద్వాజ చెబుతూ, మేం ఎంతో కష్టపడి సినిమా తెరకెక్కించామని, మా సినిమాని చూడాలని ఆడియెన్స్ కి చెప్పాలని, ఏ యూనిట్ అయినా తమ సినిమాని ఆడియెన్స్ లో ప్రమోట్ చేసుకుంటే సరిపోతుందని, అంతేకానీ మనం చిటికేస్తే, ఆడియెన్స్ ఇలాంటి సమాధానమే చెబుతారని తెలిపారు. మన యాక్షన్ పైనే ఆడియెన్స్ రియాక్షన్ ఆధారపడి ఉంటుందని చెప్పారు. సినిమా విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా ఎగిరెగిరి పడవద్దన్నారు. దేశాన్ని తగలెడదాం, ఊరుని తగలెడదాం అంటూ చివరికి మనల్ని తగలెడతారని చెప్పారు. అలా చేస్తే ఇలాంటి అనుభవాలే ఫేస్ చేయాల్సి వస్తుందని `లైగర్` చిత్రాన్ని ఉద్దేశించి తమ్మారెడ్డి తెలిపారు.
`లైగర్` పరాజయంపై ఆయన స్పందిస్తూ, ఈ చిత్రం గురించి తాను ఎక్కువగా మాట్లాడనని, తాను పూరీ జగన్నాథ్కి పెద్ద అభిమానిని అని పేర్కొన్నారు. ఆయన సినిమాలంటే తనకు ఇష్టమని, కానీ `లైగర్` ట్రైలర్ చూసినప్పుడే నచ్చలేదన్నారు. ఒకవేళ మున్ముందు సినిమా చూడాలనిపిస్తే చూస్తానని తెలిపారు.
బాయ్ కాట్ ట్రెండ్పై ఆయన రియాక్ట్ అవుతూ, అలాంటి ట్రెండ్ చేసేవాళ్లలో చాలా మంది సినిమాలు చూడరని, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాకి ఆదరణ పెరిగేకొద్దీ ఇలాంటి ట్రెండ్స్ ప్రారంభమవుతున్నాయని చెప్పారు. వాటిని లైట్ తీసుకోవాలని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ. ఒకప్పుడు సంపాదనతో కడుపు నింపడం ఎలా అని ఆలోచించేవారు, ఇప్పుడు లైకులతో కడుపులు నింపుకుంటున్నారు. వాటి కోసమే బతుకుతున్నారు. అయితేసినిమా బాగుంటే బాయ్కాట్ చేయమన్నా చేయరు, అదే బాగ లేకపోతే థియేటర్స్ కి జనాలను రమ్మన్నా రారు అని తెలిపారు. ఇండస్ట్రీలో సక్సెస్ కేవలం ఐదు శాతమే అని, 95 శాతం ఆడటం లేదన్నారు.వీరిలో 70శాతం మంది నిర్మాతలు తిండికి లేక ఇబ్బంది పడే పరిస్థితిక చేరుకుంటారని చెప్పారు.
ఇక విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన `లైగర్` చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు. ఆగస్ట్ 25న విడుదలైన ఈ సినిమా పరాజయం చెందింది. భారీ అంచనాలతో, భారీ ప్రమోషన్స్ నడుమ విడుదలైన ఈ సినిమా నిరాశ పరచడం పట్ల చాలా ట్రోల్స్ వైరల్ అయ్యాయి.