తెలంగాణ యాసలో మాట్లాడుతానంటోన్న తమన్నా..కరోనాపై ఎమోషనల్..
మిల్కీ బ్యూటీ తమన్నా తెలంగాణ పోరిగా కనిపించబోతుందట. తెలంగాణ యాసలోనూ మాట్లాడతానంటోంది. తెలంగాణ స్లాంగ్పై స్పెషల్గా ఫోకస్ పెట్టానని చెబుతోంది. కరోనా మరణాలపై ఎమోషనల్ అయ్యింది.
తెలుగు, తమిళం, హిందీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న తమన్నా ప్రస్తుతం టాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించింది. కరోనా, తాను నటిస్తున్న సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
`కొన్ని రోజులుగా సంభవిస్తున్న హృదయవిదారక ఘటనలను వింటుంటే మనసు చలించిపోతుంది. కరోనా ఫస్ట్ వేవ్లో ఎన్నో క్లిష్టతరమైన సమస్యలను ఎదుర్కొన్నాం. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రాణాంతకంగా మారి, అందర్నీ భయపెడుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న మరణాలు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి.
గత ఏడాది కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో ఆగస్టులో నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. తర్వాత అక్టోబరులో నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మా తల్లిదండ్రులకు కరోనా వచ్చిన నెల రోజుల తర్వాతే నాకు పాజిటివ్ వచ్చింది. కానీ సెకండ్ వేవ్లో ఒక కుటుంబంలోని ఒకరికి కరోనా సోకితే, ఆ కుటుంబంలోని మిగతావారికి వెంటనే పాజిటివ్ వస్తోంది. అది కూడా విభిన్నమైన లక్షణాలతో కరోనా సోకుతుండటం విచారకరం. అందరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఉంది.
తాను కరోనా బారిన పడిన విషయాలను పంచుకుంటూ దాన్నుంచి కోలుకోవడానికి రెండు నెలలు పట్టిందట. `కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి నార్మల్ కావడానికి నాకు రెండు నెలలు పట్టింది. అవి చాలా క్లిష్టతరమైన పరిస్థితులు. ఆ సమయంలో వ్యాయామాలు చేయడం చాలా కష్టంగా అనిపించింది. కోవిడ్ తర్వాత నా శరీరం పనిచేసే, స్పందించే తీరును అర్థం చేసుకుని, అందుకు తగ్గట్లు నేను నడుచుకోవడం వల్లే తొందరగా కోలుకోగలిగాను` అని తెలిపింది.
థియేటర్లు, సినిమా పరిశ్రమపై స్పందిస్తూ, థియేటర్లు ఓపెన్ అయ్యేంత వరకు డిజిటల్ కంటెంట్నే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి అని తెలిపింది. `సినిమా, వెబ్ సిరీస్లు అనేవి డిఫరెంట్ జానర్స్. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ఎంటర్టైన్మెంట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ది పెద్ద స్థాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ రిలీజ్ తప్పదు.
ఇటీవల నేను నటించిన వెబ్ సిరీస్ `నవంబరు స్టోరీస్`కు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ వెబ్ సిరీలో అనురాధా గణేశన్ పాత్ర చేశాను. దర్శకురాలు ఇంద్రా సుబ్రమణియన్ బాగా డైరెక్ట్ చేశారు. కథకు తగ్గట్లు మానవీయ భావోద్వేగాలను వీలైనంత సింపుల్గా, సహజంగా చిత్రీకరించడం ప్లస్ అయ్యింది` అని తెలిపింది.
ప్రస్తుతం తాను తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తున్నట్టు తెలిసింది. `సీటీమార్`లో జ్వాలా రెడ్డిగా కనిపిస్తుంది. తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్గా కనిపిస్తుందట. ఇందులో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పిందట. తెలంగాణ యాసని నేర్చుకుని డబ్బింగ్ చెప్పినట్టు పేర్కొంది.
వీటితోపాటు నితిన్తో `మ్యాస్ట్రో` చిత్రంలో నటిస్తుంది తమన్నా. ఇది హిందీ సినిమా `అంధాధున్`కి రీమేక్. టబు నటించిన పాత్రలో తమన్నా కనిపించబోతుంది. `హిందీ వెర్షన్ నాకు బాగా నచ్చింది. కానీ `అంధా ధున్` తెలుగు రీమేక్ సైన్ చేసిన తర్వాత ఒరిజినల్ వెర్షన్ను నేను ఒక్కసారి కూడా చూడలేదు. నటనలో నా శైలిని కోల్పోతానేమోనని చూడలేదు. టబు మంచి నటి. అయితే ఈ పాత్రకు సంబంధించి తెలుగులో కొన్ని మార్పులు ఉన్నాయి. అందుకే `మాస్ట్రో` రిలీజ్ తర్వాత టబూతో నాకు పోలికలు పెడితే నేనేం ఫీల్ అవ్వను` అని చెప్పింది. ఈ రెండు సినిమాలతోపాటు మరో రెండు చిత్రాలు `ఎఫ్3`, `గుర్తుందా శీతాకాలం` లో నటిస్తుంది.