సుశాంత్ ఫ్యామిలీ కీలక నిర్ణయం.. అభిమానుల కోసం..!
బాలీవుడ్ యువ కథనాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఆయన మరణం నుంచి కోలుకుంటున్న కుటుంబ సభ్యులు సుశాంత్కు గుర్తుగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణ వార్త నుంచి ఇండస్ట్రీ, అభిమానులే ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఇంక కుటుంబ సభ్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సుశాంత్ అస్తికలను కాశీలోని గంగానదిలో నిమజ్జనం చేసిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం సుశాంత్ అసంపూర్తిగా వదిలేసిన కలలను నిజం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా సుశాంత్కు వీడ్కోలు పలుకుతూ ఓ ప్రెస్నోట్ను రిలీజ్ చేశారు.
`సుశాంత్ సింగ్ ప్రపంచం మాకు ఓ పూదోట లాంటింది. ఆయన ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగిన మాటకారి. ఏ విషయమైనా తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న వ్యక్తి. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా కలలు కనేవాడు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించేవాడు. సుశాంత్ నవ్వు కల్మశం లేనిది. తను మా కుటుంబానికి గర్వకారణం. తన టెలిస్కోప్ తనకు ఎంతో ఇష్టమైనది, నక్షత్రాలను చూడటం సుశాంత్కు చాలా ఇష్టం.
సుశాంత్ లేడు.. ఆ నవ్వులు ఇక రావు అని ఇప్పటికీ మేం నమ్మలేకపోతున్నాం. ఏదో మెరుపున్న ఆ కళ్లు ఇక మాకు కనిపించవు. సైన్స్ గురించి అనర్గళంగా మాట్లాడే ఆ కంఠం ఇక వినిపించదు. అతడి మరణం మాకు ఎప్పటికీ తీరని లోటే.
సుశాంత్కు తన అభిమానులంటే ఎంతో ఇష్టం. వారు తన మీద చూపించే ప్రేమానురాగాలు సుశాంత్ ఎప్పుడూ గుర్తు చేసుకునేవాడు. సుశాంత్ మీద ఇంతటి ప్రేమానురాగాలను చూపించిన మీద అందరికీ మా తరుపున కూడా కృతజ్ఞతలు.
సుశాంత్కు గుర్తుగా, గౌరవార్ధకంగా ఉండేలా కుటుంబం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సుశాంత్ పేరు మీద సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫౌండేషన్ను ప్రారంభిస్తున్నాం. దాని ద్వారా సినిమా, సైన్స్, క్రీడా రంగాల్లో అవకాశాలు దక్కక ఇబ్బందుల్లో ఉన్న యంగ్ టాలెంట్ను సపోర్ట్ చేయనున్నారు.
చిన్నతనంలో సుశాంత్ పెరిగిన పాట్నా, రాజీవ్ నగర్లోని ఇంటిని అతడి మెమొరియల్గా మార్చేందుకు నిర్ణయించారు. అక్కడ ఇన్నాళ్లు సుశాంత్ వినియోగించిన వస్తువలతో పాటు ఎంతో ముచ్చటపడి సుశాంత్ కొనుకున్న కాస్ట్లీ టెలిస్కోప్, ఫ్లైట్ సిమ్యులేటర్ లను ప్రదర్శనకు ఉంచనున్నారు. అంతేకాదు సుశాంత్ సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా కొనసాగించేందుకు నిర్ణయించారు.