చేయనని ఏడ్చినా వదల్లేదు.. అంతా యాక్సిడెంటల్గా జరిగింది.. సినిమా ఎంట్రీ ఎలా జరిగిందో చెప్పిన సౌందర్య..
సహజ నటి సౌందర్య హీరోయిన్గా హిందీతోపాటు సౌత్ మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. ఆమె సినిమా ఎంట్రీ మాత్రం విచిత్రంగా జరిగింది. ఆ విషయాన్ని బయటపెట్టింది.
సౌందర్య.. నేచురల్ బ్యూటీ.. అందం, అంతకు మించిన అభినయం ఆమె సొంతం. చీరలోనే ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించింది. ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే సౌత్ సినిమా మొత్తాన్ని ఊపేసింది. హిందీలోనూ మెప్పించింది. అనూహ్యంగా ఆమె మన నుంచి వెళ్లిపోయి కోట్ల మంది అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తింది.
కన్నడకి చెందిన సౌందర్య కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా తెరంగేట్రం చేసింది. ఆమె నటిగా మెప్పించింది. అట్నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక టాలీవుడ్లోకి అడుగుపెట్టాక ఆమె లైఫే మారిపోయింది. స్టార్ హీరోయిన్గా రాణించింది. కన్నడ, తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అన్ని చోట్ల స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే సౌందర్య సినిమా ఎంట్రీ ఎలా జరిగిందనేది ఆసక్తికరం. ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది. ఎంత విచిత్రంగా తాను సినిమాల్లోకి వచ్చిందోతెలిపింది. టెంన్త్ అయిపోగానే ఆమె సినిమాల్లోకి వచ్చిందట. అది కూడా తనకు ఇష్టం లేకుండానే, బలవంతంగానే సినిమాల్లోకి తీసుకొచ్చినట్టు చెప్పింది సౌందర్య.
ఆ విషయాలు చెబుతూ, తన సినిమా ఎంట్రీ విచిత్రంగా జరిగింది. టెంన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇక రిలాక్స్ గా ఉన్న సమయంలో ఓ రోజు నాన్న వచ్చిన ఇలా సినిమా షూటింగ్ ఉందని చెప్పాడు. నాకు ఇష్టం లేదు, నేను రాను, చేయను అని ఏడ్చేశాను. అయినా వినలేదు. షూటింగ్కి తీసుకెళ్లాడు. అక్కడ అంతా కొత్త, ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియదు. అంతా జనాలున్నారు, లైట్స్ ఉన్నాయి. వేరే ప్రపంచంలా అనిపించింది.
ఆ తర్వాత నాకు మేకప్ వేశారు, ఏం జరుగుతుందో తెలియక అలా స్టిఫ్గా ఉండిపోయాను. కెమెరా ముందుకు తీసుకెళ్లారు. వాళ్లు చెప్పింది ఏదో చేసి వచ్చేశాను. ఆ తర్వాత అది గుర్తు చేసుకుంటూ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. చాలా యాక్సిడెంటల్గా తన సినిమా ఎంట్రీ జరిగిందని చెప్పింది సౌందర్య. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో సౌందర్య ఈ విషయాన్ని వెల్లడించగా, ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.
`గాంధర్వ` చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది సౌందర్య. కానీ ఆమె ఫస్ట్ షూటింగ్లో పాల్గొన్న మూవీ `బా నాన్న ప్రీతిసు`. కానీ `గాంధర్వ` ముందు విడుదలైంది. 1992లో ఆమె సినీ రంగ ప్రవేశం జరిగింది. 1993లో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె ఒప్పుకున్న ఫస్ట్ తెలుగు మూవీ `అమ్మోరు`. ఇది ఆలస్యంగా విడుదలైంది. కానీ `మనవరాలు పెళ్లి` అనే సినిమా మొదట విడుదలైంది. ఆ తర్వాత `రాజేంద్రుడు గజేంద్రుడు`, `మాయలోడు` చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. ఇక తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
సౌందర్య తెలుగులో అనేక సినిమాలు చేసింది. సూపర్ హిట్స్ అందుకుంది. చివరగా ఆమె `శివశంకర్` చిత్రంలో నటించింది. ఆమె నటించిన `నర్తనశాల` నాలుగేళ్ల క్రితం విడుదల చేశారు. ఇక ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన సౌందర్య 2004లో విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కానీ ఆమె తన సినిమాలతో ఆడియెన్స్ హృదయాల్లో పదిలంగానే ఉంది.