సారంగ దరియా టు భలేగుంది బాల.. జానపదానికి ఊపిరిలూదుతున్న టాలీవుడ్
టాలీవుడ్లో ఫోక్ సాంగ్స్(జానపద) ట్రెండ్ ఊపందుకుంది. ఇటీవల సాయిపల్లవి నటించిన `లవ్స్టోరి`లోని `సారంగదరియా` పాట ఎంతగా ఉర్రూతలూగిస్తుందో తెలిసిందే. అంతకు ముందు వచ్చిన `భలేగుంది బాలా..`, `రాములో రాముల.. `, `సిత్తరాల సిరపడు..`, `నాది నక్కిలీసు గొలుసు` పాటలు ఆడియెన్స్ ని, శ్రోతలను మైమరపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇటీవల వస్తోన్న జానపద సాంగ్స్ పై ఓ లుక్కేద్దాం.
`సారంగదరియా` పాట లేటెస్ట్ గా టాలీవుడ్లో వచ్చిన జానపద పాటల్లో బాగా ఆదరణ పొందింది. మంగ్లీ పాడిన ఈ పాట యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. వంద మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టి టాలీవుడ్ని షేక్ చేస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన `లవ్ స్టోరి`లోని పాట ఇది. సాయిపల్లవిపై వచ్చే ఈ తెలంగాణ ఫోక్ సాంగ్ ని ప్రముఖ లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ రాయడం విశేషం.
అయితే ఈ పాట హక్కుల విషయంలో వివాదం మారింది. కోమలి ఇది తాను సేకరించానని, పదేళ్ల క్రితమే దీన్ని తాను పాడానని బహిరంగంగా వాపోయింది. తనకు అన్యాయం జరిగిందని తెలిపింది. దీనిపై స్పందించిన దర్శకుడు ఆమె తన తర్వాతి సినిమాల్లో పాడే అవకాశం ఇస్తానని తెలిపారు. వివాదం విషయం పక్కన పెడితే టాలీవుడ్లో ఫోక్ సాంగ్ ట్రెండ్కి ఊపు తీసుకొచ్చిన పాట ఇదే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
దీంతోపాటు ఇటీవల శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన `శ్రీకారం` చిత్రంలోని `భలేగుంది బాలా` అనే ఫోక్ సాంగ్ కూడా సినిమా విజయానికి అతీతంగా సక్సెస్ సాధించింది. మార్కెట్లో ఎక్కడ చూసినా వైరల్గా మారింది. మాస్ ఆడియెన్స్ ని మెప్పించింది. దీన్ని జానపద పాటల రచయిత పెంచల్ దాస్ పాడి ఆలపించడం విశేషం. దీనికి `మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సినిమాకి కిశోర్.బి దర్శకత్వం వహించారు. ఆయనకిది తొలి చిత్రం కావడం విశేషం. కొత్త దర్శకులు కూడా జానపద పాటలను ఎంకరేజ్ చేయడం విశేషం.
జానపద పాటల్లో గతేడాది బాగా పాపులర్ అయిన సాంగ్స్ అల్లు అర్జున్ హీరోగా నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంలోని పాటలే అని చెప్పొచ్చు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆల్బమ్ టాప్ రేటింగ్లో, టామ్ వ్యూస్లో దూసుకుపోతుంది. ఇందులోని కాసర్ల శ్యామ్ రాసిన `రాములో రాముల.. ` పాట 300 మిలియన్స్ కిపైగా వ్యూస్ని రాబట్టుకుంది. ఈ పాటని మంగ్లీతోపాటు అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
`అల వైకుంఠపురములో`నే మరో సాంగ్ `సిత్తరాల సిరపడు` పాట సైతం రాయలసీమ స్లాంగ్లో దుమ్మురేపింది. ఈ పాటని బడా సురన్నా, సకేత్ కొమండూరి ఆలపించారు. విజయ్ కుమార్ భల్లా రాశారు. ఇది జానపద పాటగా విశేషం శ్రోతకాదరణ పొందింది.
డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా హంగామా చేస్తోన్న పాట `నాదీ నక్కిలీసు గొలుసు`. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఈ పాటని వెండితెరపైకి తీసుకొచ్చాడు రఘు కుంచె. `పలాస 1978` సినిమాలో ఈ పాటని రీ క్రియేట్ చేశాడు. టిక్టాక్తో మరింత ఫేమస్ అయిన ఈ పాట, టిక్టాక్ బ్యాన్ అయ్యాక కూడా సందడి చేస్తూనే ఉంది. ఇప్పటికే ఫంక్షన్లలో, ఇతర వేడుకల్లో, ఆటోల్లో దుమ్మురేపుతూనే ఉందీ పాట.
త్రివిక్రమ్ `అల వైకుంఠపురములో` కంటే ముందే `అరవింద సమేత`లో జానపద పాటల టేస్ట్ ని తెలుగు తెరకి పరిచయం చేశారు. ముఖ్యంగా ఆయన రాయలసీమ ఫోక్ సాంగ్స్ ని పరిచయం చేశారు. ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రంలోని `రెడ్డమ్మ` పాట ఎంతగానో ఆకట్టుకుంది. పెంచల్ దాస్ రాసిన ఈ పాటని మోహన భోగరాజు ఆలపించారు. థమన్ సంగీతం అందించారు. ఇది కూడా 110 మిలియన్స్ కిపైగా వ్యూస్ని దక్కించుకుంది.
ఇందులోని మరో పాట `ఏడ పోయినాడో.. `అనే పాట సైతం రాయలసీమ జానపద సాంగే. ఈ పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రి, పెంచల్దాస్ రాయగా, నిఖితా శ్రీవల్లి, కైలాష్ ఖేర్, పెంచాల్దాస్ కలిసి ఆలపించారు.
దీంతోపాటు `నల్లమల` అనే సినిమాలోని `ఏమున్నావే పిల్లా.. `అనే ఫోక్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా జనాలకు పెద్దగా తెలియకపోయినా, సిద్ శ్రీరామ్ తన స్టయిల్లో పాడి శ్రోతలను అలరించారు.
మరోవైపు నాని హీరోగా నటించిన `కృష్ణార్జున యుద్ధం` చిత్రంలోని `దారిచూడు దమ్ముచూడు` పాట శ్రోతలను ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. ఈ పాటని పెంచల్ దాస్ రాసి పాడారు.
ఇలా జానపద పాటలు ఇటీవల సినిమాల్లో విశేషంగా ఆకట్టకుంటున్నాయి. దర్శకులు సైతం ఇలాంటి పాటలను ఎంకరేజ్ చేస్తున్నారు. సంగీత దర్శకులు సైతం వాటిని అదే స్టయిల్లో కమర్షియల్ లుక్ని తీసుకొచ్చి థియేటర్లలో మోతమోగిస్తున్నారు, జనాల చేత స్టెప్పులేయిస్తున్నారు. మెలోడీ సాంగ్లకు, మాస్ కమర్షియల్ సాంగ్లను మించిన ఆదరణ తెప్పిస్తున్నారు. అదే సమయంలో జానపద పాటలకు ఓ విలువని, గౌరవాన్ని తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. దీంతో సినిమాల్లో ఫోక్ సాంగ్స్ అనేది ఓ ట్రెండ్గా మారింది. ఇవి మున్ముందు మరింగా జానపద పాటలు దూసుకొస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.