అబ్దుల్ వివాదంపై స్పందించిన సాయిధరమ్ తేజ్..మేము ఎప్పుడూ అలా చెప్పలేదు అంటూ..
సుప్రీం హీరో సాయిధరమ్ విరూపాక్ష సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తేజు నటించిన తొలి చిత్రం ఇదే. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

సుప్రీం హీరో సాయిధరమ్ విరూపాక్ష సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తేజు నటించిన తొలి చిత్రం ఇదే. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఊహించని వివాదం సాయిధరమ్ తేజ్ మెడకి చుట్టుకుంది.
సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైనప్పుడు అబ్దుల్ అనే యువకుడు సకాలంలో స్పందించి తేజు పరిస్థితి మరింత తీవ్రంగా మారకముందే ఆసుపత్రికి తరలించేలా సహాయపడ్డాడు. దీనితో సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ కి మీడియాలో మెగా అభిమానుల్లో మంచి పాపులారిటీ దక్కింది.
అయితే ఇటీవల విరూపాక్ష ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తేజు మాట్లాడుతూ ఫర్హాన్ గురించి స్పందించాడు. తనకి అంత సహాయం చేసిన ఫర్హాన్ కి కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకోవడం లేదని.. అందుకే తన కాంటాక్ట్ నంబర్ ఇచ్చి ఒక బ్రదర్ లాగా ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు తేజు తెలిపారు.
అయితే మీడియా అబ్దుల్ ఫర్హాన్ ని కలిసి మాట్లాడగా.. తనని సాయిధరమ్ తేజ్ కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఎవరూ కలవలేదని.. ఎవరి ఫోన్ నంబర్లు నా దగ్గర లేవని తెలిపాడు, తనకు సాయం చేసేందుకు కూడా ఎవరూ ఫోన్ చేయలేదని ఫర్హాన్ బదులిచ్చాడు. దీనితో సాయిధరమ్ తేజ్ ని ట్రోల్ చేస్తూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వివాదంపై తేజు తాజాగా క్లారిటీ ఇచ్చారు. నామీద, నా టీం మీద కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నేను కానీ, నాటీం కానీ ఫర్హాన్ కి ఆర్థికంగా సాయం చేసినట్లు ఎక్కడా చెప్పలేదు. అతడు చేసిన సహాయానికి నేను నానా ఫ్యామిలీ ఎప్పటికి రుణపడి ఉంటాం.
మా డీటెయిల్స్ అతడి వద్ద ఉన్నాయి. ఫర్హాన్ ఎప్పుడైనా నా మేనేజర్ శరన్ ద్వారా నన్ను మీట్ అవ్వచ్చు. ఈ వివాదంపై ఇదే నా చివరి స్పందన అంటూ తేజు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.