4 వేల కోట్లతో సాయి పల్లవి సినిమా.. ఇండియన్ మూవీ షేక్ అయ్యే వార్త వైరల్
సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న సినిమా ఒకటి రూ.4000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది.

`రామాయణ్`లో సీతగా సాయిపల్లవి
రామాయణం ఆధారంగా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఆ మధ్య ప్రభాస్ సైతం `ఆదిపురుష్` చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు బాలీవుడ్లో మరో `రామాయణ` రూపొందుతుంది.
రణ్ బీర్ కపూర్, సాయిపల్లవి, యష్, సన్నీ డియోలో ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీ రూపొందుతుంది. నితేష్ తివారీ రూపొందిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి విశేష స్పందన లభించింది. త్రీడీ ఐమాక్స్ ఫార్మాట్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు.
రావణుడిగా యష్ నటిస్తున్నారు. హనుమాన్గా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగంగా వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది.
`రామాయణ` సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే
ప్రతీక్ గుప్తాతో జరిగిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో నిర్మాత నమిత్ మల్హోత్రా సినిమా బడ్జెట్ గురించి మాట్లాడారు. 'రామాయణ' సినిమా రెండు భాగాలకు కలిపి రూ.4000 కోట్లకు పైగా ఖర్చవుతుందని తెలిపారు.
ఇది విని చాలా మంది తనను పిచ్చివాడిగా అంటున్నారని కూడా ఆయన అన్నారు. ఏ భారతీయ సినిమా బడ్జెట్ కూడా 'రామాయణం' సినిమా బడ్జెట్కు దగ్గరగా కూడా లేదని, ఇది ఒక మహా కావ్యం కాబట్టి, ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ వహిస్తున్నామని ఆయన అన్నారు.
హాలీవుడ్ సినిమాల బడ్జెట్తో పోలిస్తే ఇది ఎక్కువ ఏమీ కాదని, ప్రపంచంలోనే అత్యుత్తమ మహా కావ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూడాలనేది చిత్ర బృందం కోరిక అని ఆయన తెలిపారు.
రామాయణం చిత్ర బృందం పారితోషికం
నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం ఆయన విస్తృతంగా పరిశోధన చేశారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి భాగం చిత్రీకరణ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
హాన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను పంపిణీ చేయడానికి హాలీవుడ్ స్టూడియోతో చర్చలు జరుపుతున్నారు. సినిమాలో అధిక నాణ్యత గల స్టంట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.
ఈ చిత్రంలో నటించినందుకు రణ్బీర్ కపూర్ రెండు భాగాలకు కలిపి రూ.150 కోట్లు, యష్ రూ.100 కోట్లు, సాయి పల్లవి రూ.12 కోట్లు పారితోషికంగా తీసుకున్నారట.
'రామాయణ` స్టార్ కాస్ట్
'రామాయణం' సినిమా రెండు భాగాల్లో దాదాపు 20 మంది నటులు నటిస్తున్నారు. రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యష్ నటిస్తున్నారు.
వీరితోపాటు అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఇందిరా కృష్ణన్, శిబా చత్తా, మోహిత్ రైనా, కునాల్ కపూర్, వివేక్ ఒబెరాయ్, శోభనా, అమితాబ్ బచ్చన్ వంటి వారు కూడా నటిస్తున్నారు. సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదలవుతుందని ప్రకటించారు.