మరో రైటర్ ని డైరక్టర్ చేస్తున్న రవితేజ? త్వరలో ఎనౌన్సమెంట్
తాజాగా మాస్ మహారాజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ దర్శకుడు కొత్త వారు అదీ ఓ రైటర్ అంటున్నారు.
గత సంవత్సరం సంక్రాతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో.. చిరు తమ్ముడి పాత్రలో అధ్భుతంగా నటించారు ఈ మాస్ మహారాజా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'రావణాసుర'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేకపోయింది. వెంటనే రవితేజ.. దర్శకుడు మహేశ్తో 'టైగర్ నాగేశ్వరరావు' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేసారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సంవత్సరం ఇప్పటికే ఈగల్ సినిమాతో పలకరించారు. అదీ అంతంత మాత్రమే అయ్యింది. అయితే, తాజాగా ఈ మాస్ మహారాజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది. ఆ దర్శకుడు కొత్త వారు అదీ ఓ రైటర్ అంటున్నారు. అసలా రైటర్ ఎవరు?
కొత్త డైరక్టర్స్ ని తెలుగు తెరకు పరిచయం చేయటంలో రవితేజ మొదటి నుంచి ముందుంటున్నారు. రవితేజ క్యాంప్ నుంచి వచ్చిన డైరక్టర్స్ ఆ తర్వాత స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే రేంజ్కు వెళ్లారు. ఇప్పుడు ఫామ్ లో ఉన్న బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, బాబీ, గోపిచంద్ మలినేనిలకు మొదటి అవకాశం ఇచ్చింది రవితేజనే. అయితే గతకొన్నేళ్ల నుంచి రవితేజ కొత్త దర్శకులతో సినిమాలు చేయట్లేదు. టచ్ చేసి చూడు వంటి డిజాస్టర్ తర్వాత కొత్త దర్శకులను పక్కన పెట్టేశాడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు రవితేజ ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.
వరస పెట్టి సీరియస్ సబ్జెక్టులు చేస్తున్న రవితేజ మళ్లీ తన కామెడీ జోనర్ లోకి వెళ్దామనుకుంటున్నారట. ఇంతకు ముందు వెంకీ, కిక్, దుబాయ్ శీను వంటి కామెడీ ఎంటర్టైనర్స్ ఇచ్చారు. రీసెంట్ గా కూడా ధమాకా అంటూ కామెడీగా హిట్ కొట్టారు. అయితే ఈ మధ్య గ్యాప్ లో రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ఇలా వరసపెట్టి సీరిస్ సినిమాలు చేసారు. అవేమీ వర్కవుట్ కాలేదు. దాంతో కామెడీ కు ప్రాధాన్యత ఇచ్చే స్క్రిప్టు కోసం ఎదురుచూస్తూంటే ఓ ఎంటర్టైనర్ తో ఓ రచయిత కథ వినిపించటం జరిగిందిట.
ఆ రైటర్ మరెవరో కాదు సామజవరగమన చిత్రంతో హిట్ కొట్టి అందరి దృష్టిలో పడిన భాను భోగవరపు అని తెలుస్తోంది. రీసెంట్ గా భాను...రవితేజ కు ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నారని అంటున్నారు. కథ బాగా నచ్చటం, చెప్పే విధానం ఆసక్తిగా ఉండటంతో నువ్వే డైరక్ట్ చేయి అని రవితేజ ఆఫర్ ఇచ్చినట్లు గా ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఆ కథ పూర్తిగా సామజవరగమన టైప్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పుకుంటన్నారు. అయితే బ్యానర్ ఏంటనేది తెలియలేదు.
మరోప్రక్క ఇప్పటికే మరో కామెడీ ఎంటర్టైనర్ తో రవితేజ ఓ ప్రాజెక్టు ఓకే చేసారని వార్తలు వస్తున్నాయి. ఆ డైరక్టర్ అనుదీప్. సితార బ్యానర్లో ఈ సినిమాని రవితేజ కమిట్ అయ్యాడు.అనుదీప్ చెప్పిన లైన్ రవితేజ కు బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ను రెడీ చేయమని చెప్పాడని ఇన్సైడ్ టాక్. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ ఇచ్చిన అనుదీప్.. కామెడీ అద్భుతంగా పండించగల రవితేజను ఎలా చూపించబోతున్నారన్న ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది. ఈ కామెడీ కాంబో వర్కవుట్ అయితే బొమ్మ బ్లాక్బస్టర్ హిట్ట్ కొట్టడం ఖాయమని అంటున్నారు అభిమానులు. అయితే, ఈ వార్తలపై అటు రవితేజ గాని.. అనుదీప్ గాని స్పందించలేదు.
Waltair Veerayya
ప్రస్తుతం రవితేజ ఉన్న లైనప్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ త్వరలోనే మొదలు కానుందిట.మరోవైపు మిరపకాయ్ దర్శకుడు హరీష్ శంకర్తో హిందీ రైడ్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ జోరుగా జరుగుతోంది. అలాగే ధమాకాతో తనకు వంద కోట్ల హిట్ ఇచ్చిన త్రినాథరావు నక్కినతోనూ మాస్ రాజా ఓ సినిమా చేయనున్నాడు.
అలాగే హీరోగానే కాకుండా నిర్మాతగానూ రవితేజ దూసుకెళ్తున్నారు. ఈ ప్రోడ్యూస్ చేసిన సినిమా 'చాంగురే బాంగారు రాజా' , సుందరం మాస్టర్ సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. అయితే రెండు సినిమాలు వర్కవుట్ కాలేదు. దాంతో నెక్ట్స్ నిర్మించబోయే చిత్రాల విషయంలో ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు రవితేజ. ఈ మేరకు ఆయన ఆఫీస్ లో కథలు వింటున్నారు.
ఇక వీటితో పాటు రవితేజ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన వరుణ్ ధావన్తో కలిసి ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇది తమిళంలో విజయవంతమైన 'మానాడు'కు హిందీ రీమేక్గా ఉంటుందని తెలుస్తోంది. హీరో రానా, కరణ్ జోహార్, ఏషియన్ సునీల్ దీన్ని సంయుక్తంగా నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా వ్యవహరించనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్లే అవకాశముందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.