ఆగిపోతున్న రవితేజ, గోపీచంద్, కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్ సినిమాలు?.. అదే కొంపముంచుతుందా?
రవితేజ, గోపీచంద్, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్ సినిమాలు ఆగిపోతున్నాయి. ప్రధానంగా రెండు విషయాలు వీరికి పెద్ద దెబ్బగా మారుతున్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయి దాటి, గ్లోబల్ మార్కెట్పై కన్నేసింది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు హిట్ అయితే ప్రపంచ మార్కెట్ని క్యాచ్ చేయబోతున్నాయని చెప్పొచ్చు. ఓ వైపు స్టార్ హీరోలు ఆ దిశగా సినిమాలు చేస్తున్నారు. భారీ ప్రయోగాలు చేస్తున్నారు. కానీ కొందరు హీరోలు మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. సక్సెస్ ల కోసం పోరాడుతున్నారు. సరైన స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకోలేక తడబడుతున్నారు. వరుసగా పరాజయాలను చవిచూస్తున్నారు. ఈ క్రమంలో కెరీర్ ప్రమాదంలో పడుతుంది. అదే సమయంలో కొన్ని సినిమాలు ఆగిపోతున్నాయి.
మార్కెట్ తక్కువగా ఉన్న హీరోపై ఎక్కువ బడ్జెట్ పెడితే రికవరీ కష్టం. మార్కెట్ని మించి కొనేందుకు బయ్యర్లు ముందుకు రారు. మొన్నటి వరకు పరుగులు పెట్టించిన ఓటీటీలు ఇప్పుడు పడకేస్తున్నాయి. యంగ్ హీరోల సినిమాలు కొనేందుకు ముందుకు రావడం లేదు. తక్కువ రేట్కి కోట్ చేస్తున్నారు. దీంతో అనుకున్న రేట్కి అమ్ముకోలేక నిర్మాతలు తంటాలు పడుతున్నాయి. ఈ పరిణామాలు సినిమాలపై ప్రభావం పడుతున్నాయి. బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది హీరోల సినిమాలు ఆగిపోతున్నట్టు తెలుస్తుంది.
వారిలో మాస్ మహారాజా రవితేజ కూడా ఉండటం విచారకరం. ఆయన గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది. 80-90కోట్ల అవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో రవితేజపై అంత బడ్జెట్ వర్కౌట్ కాదని సినిమాని క్యాన్సిల్ చేశారట. అయితే ఇందులో రవితేజనే 30కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం ఓ కారణం అని తెలుస్తుంది. మరోవైపు ఓటీటీలో రవితేజ సినిమాలకు డిమాండ్ లేదు, ఆదరణ దక్కడం లేదు. దీంతో ఓటీటీ సంస్థలు రవితేజ సినిమాని కొనేందుకు ముందుకు రావడం లేదట. ఇది కూడా నిర్మాతలు వెనక్కి తగ్గడానికి కారణమని తెలుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
దీంతోపాటు రవితేజ నటించే మరో సినిమా కూడా డైలామాలో ఉందని టాక్. రవితేజకి ఇటీవల హిట్ లేదు. ఎన్నో అంచనాలు, ఆశలతో వచ్చిన `టైగర్ నాగేశ్వరరావు` ఆడలేదు. అంతకు ముందు వచ్చిన `రావణాసుర` డిజప్పాయింట్ చేసింది. ఇటీవల వచ్చిన `ఈగల్` థియేట్రికల్గా సేఫ్ కాలేదు. బాగుందనే హైప్ వచ్చినా, బాక్సాఫీసు వద్ద మాత్రం డీలా పడింది. ఈ నేపథ్యంలో వీటి ప్రభావం కొత్త సినిమాలపై పడుతుందని తెలుస్తుంది. రవితేజ అధికారికంగా ఇప్పుడు ఒక్క హరీష్ శంకర్ మూవీ `మిస్టర్ బచ్చన్` మాత్రమే చేస్తున్నారు. దీన్ని తక్కువ బడ్జెట్లో చేస్తున్నట్టు సమాచారం.
మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా ఈ లిస్ట్ లో ఉండటం విచారకం. ఆయన శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని చిత్రాలయ ప్రొడక్షన్ నిర్మించింది. 30శాతం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఆగిపోయింది. బడ్జెట్ కారణంగా ఆపేశారని తెలుస్తుంది. దర్శకుడు శ్రీనువైట్ల గట్టిగా ఖర్చు పెడుతున్నాడట. పైగా గోపీచంద్, శ్రీనువైట్ల పారితోషికాలు బాగానే ఉన్నాయట. ముందు అనుకున్న బడ్జెట్ కంటే పెరిగిపోతుంది. దీంతో నిర్మాతలు చేతులెత్తేశారు. తమ వల్ల కావడం లేదని డైలామాలో పడ్డారట. మధ్యలో బిగ్ బ్యానర్తో చర్చలు జరిగాయి. నిర్మించేందుకు ముందుకు వచ్చారు. కానీ వాళ్లు కూడా హ్యాండిచ్చారట. ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి. వాళ్లు ఒప్పుకుంటే సినిమా ఉంటుంది, లేదంటే ఆగిపోతుందని అంటున్నారు.
గోపీచంద్ కి కూడా ఓటీటీ బిజినెస్ కావడంలో లేదు. చాలా తక్కువకి కోట్ చేస్తున్నారట. ఓటీటీలో ఆయన సినిమాలకు పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం వల్లే ఓటీటీలు వారి సినిమాలను కొనేందుకు వెనకాముందు ఆలోచిస్తున్నారని, తక్కువకి కోట్ చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో మార్కెట్ని మించి బడ్జెట్ పెడితే ఆ తర్వాత రికవరీ కష్టం అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు సందిగ్దంలో పడుతున్నారట. ఈ క్రమంలోనే గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ ఆగిపోయిందని అంటున్నారు. మరి తిరిగి స్టార్ట్ అవుతుందా? లేదా అనేది చూడాలి. ఇదే కాదు గోపీచంద్ ఎంపిక చేసుకుంటున్న సినిమాలు రొటీన్గా ఉంటున్నాయి. అరిగిపోయిన ఫార్మూలాతో సినిమాలు చేస్తున్నారు. దాన్నుంచి బయటపడటం లేదు. దీంతో సినిమాలు వరుసగా పరాజయం అవుతున్నాయి. అది కొత్త సినిమాల బడ్జెట్పై ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాల సమాచారం.
వరుణ్ తేజ్ కెరీర్ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడుతుంది. ఆయనకు వరుసగా మూడు నాలుగు ఫ్లాప్లు పడ్డాయి. `ఎఫ్2` తర్వాత చెప్పుకునే హిట్ లేదు. `ఎఫ్3` కూడా పెద్దగా ఆడలేదు. సోలో హీరోగా `తొలి ప్రేమ`, `ఫిదా`నే హిట్లు. ఆ తర్వాత గన్ షాట్ హిట్ లేదు. మొన్న వచ్చిన `ఆపరేషన్ వాలెంటైన్` కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో వరుణ్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రమాదంలోకి వెళ్తుందనే ఫీలింగ్ కలుగుతుంది. దీంతో ఆయనపై కూడా భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం నటించాల్సిన `మట్కా` ఆగిపోతుందా అనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.
గత చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు(వైరా ఎంటర్టైన్మెంట్స్) వెనకడుగు వేస్తున్నారట. కరుణకుమార్ దర్శకత్వం వహించే ఈ మూవీకి 60కోట్లు బడ్జెట్ అవుతుందట. వరుణ్పై అంత బడ్జెట్ అంటే కష్టమే అంటున్నారు. ఓటీటీలోనూ వరుణ్ తేజ్ సినిమాలకు ఆదరణ దక్కడం లేదట. దీంతో ఓటీటీ బిజినెస్పై డిపెండ్ కాలేని పరిస్థితి. మరోవైపు థియేట్రికల్గా ఆయన సినిమాలు పట్టుమని యాభై కోట్లు వసూలు చేసే పరిస్థితి లేదు. అందుకే నిర్మాత `మట్కా` విషయంలో డైలామాలో ఉన్నారట. ఇది ఉంటుందా? లేదా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
కళ్యాణ్ రామ్ కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. ఆయన `బింబిసార`తో హిట్ కొట్టి మళ్లీ పుంజుకున్నారు. ఆ తర్వాత చేసిన `అమిగోస్`, `డెవిల్` చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఇది `బింబిసార2`పై పడిందట. పైగా ఇప్పటికే దర్శకుడు మారాడు. భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కించాల్సి ఉంది. ఓ వైపు దర్శకుడిని మార్చడం, మరోవైపు భారీ బడ్జెట్ కావడంతో ఈ విషయంలో కళ్యాణ్ రామ్ ఆలోచిస్తున్నారట. ఈ మూవీ ఉంటుందా? లేదా అనేది డైలమాలో పడింది. ఆల్మోస్ట్ దీన్ని పక్కన పెట్టారట.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్.. ప్రదీప్ చిల్కూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతుంది. గతేడాది అక్టోబర్లో ఇది ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. షూటింగ్ అవుతుందా? ఆగిపోయిందా అనే డౌట్ అందరిలోనూ కలుగుతుంది.
tollywood heroes
వీరే కాదు, ఈ జాబితాలో నితిన్ కూడా ఉన్నారు. ఆయన సినిమాలు కూడా వర్క్ అవుతలేవు. ఆయనపై కూడా భారీ బడ్జెట్కి నిర్మాతలు సాహసం చేయడం లేదు. సందీప్ కిషణ్, అఖిల్, రాజ్ తరుణ్ సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితినే ఉందట. వీరంతా తేరుకొని వాస్తవంలోకి రావాలి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసి హిట్లు అందుకుని, తమ మార్కెట్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే కెరీరే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.