- Home
- Entertainment
- Raashi Khanna: డాక్టర్ కాదు, యాక్టర్ కాదు, రాశీఖన్నా అసలు డ్రీమ్ ఇదే.. పవన్ కళ్యాణ్ ముందు నిజం చెప్పేసింది
Raashi Khanna: డాక్టర్ కాదు, యాక్టర్ కాదు, రాశీఖన్నా అసలు డ్రీమ్ ఇదే.. పవన్ కళ్యాణ్ ముందు నిజం చెప్పేసింది
పవన్ కళ్యాణ్ నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్`లో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తన డ్రీమ్ గురించి వెల్లడించింది. సినిమాల్లోకి రావాలనుకోలేదట.

ఉస్తాద్ భగత్ సింగ్తో రాశీఖన్నా బౌన్స్ బ్యాక్
రాశీఖన్నా `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే పాపులర్ అయ్యింది. తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అయితే రాశీ ఇటీవల కాలంలో కాస్త డల్ అయ్యింది. సరైన సినిమాలు పడకపోవడం, హిట్లు రాకపోవడంతో కొంత డల్ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె కెరీర్కి ఊపుని తీసుకొచ్చిన చిత్రం `ఉస్తాద్ భగత్ సింగ్`. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. శ్రీలీల కథానాయిక. ఇందులో రాశీఖన్నా ఓ హీరోయిన్గా నటిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్తో కలిసి నటించడం చాలా కాలంగా తన డ్రీమ్ ఇప్పుడు నెరవేరింది. దీంతో తన సంతోషాన్ని పంచుకుంది రాశీఖన్నా.
పవన్ కళ్యాణ్తో నటించడం రాశీఖన్నా డ్రీమ్
`ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ ఈ నెల 19న ఉగాది కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం రాశీఖన్నా మీడియాతో మాట్లాడింది. ఇందులో ఆమె చెబుతూ, `పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో వెంటనే ఓకే చెప్పేశాను. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే, పవన్ కళ్యాణ్ స్టార్డమ్ గురించి, పవనిజం గురించి విన్నాను. అప్పుడే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలి అనుకున్నాను. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో నా కల నెరవేరింది. ఇందులో నా పాత్ర పేరు శ్లోక. మోడ్రన్ అమ్మాయిని. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. నా పాత్రకు కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు ఇందులో ఒక మాస్ సాంగ్ ఉంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను` అని చెప్పింది రాశీ ఖన్నా.
రాశీఖన్నా డ్రీమ్ ఇదే
ఈ సందర్భంగా తన డ్రీమ్ గురించి ఓపెన్ అయ్యింది రాశీఖన్నా. తాను నటి కావాలని, సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. అలాగని డాక్టర్ అవ్వాలనే ఆలోచన కూడా లేదట. ఈ క్రమంలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది రాశీ. తాను ఐఏఎస్ కావాలనుకుందట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్తో వెల్లడించింది. ఆమె చెబుతూ, పవన్ చాలా సింపుల్ పర్సన్, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం ఉంది. మీరు నటి కావాలని ముందే అనుకున్నారా? అని మొదటిరోజే నన్ను అడిగారు. లేదు సార్, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని చెప్పాను. ఆయన తక్కువ మాట్లాడతారు కానీ, ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. పవన్ గారు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ గారి అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది` అని చెప్పింది.
హరీష్ శంకర్ గురించి రాశీఖన్నా
హరీష్ శంకర్ గారు చాలా స్మార్ట్. ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసు. సాధారణంగా 120 రోజులు పట్టే షూటింగ్ను ఆయన కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేశారు. సరిగా నిద్ర కూడా పోకుండా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో సెట్లోనే పంచ్ డైలాగ్స్ రాసి ఇస్తుంటారు. హరీష్ కి ఓపిక ఎక్కువ. సినిమా పట్ల ఆయన అంకితభావం చూసి చాలా నేర్చుకున్నాను. సినిమా కోసం ప్రాణం పెట్టే నిర్మాతలు ఈ మూవీకి పనిచేశారు. బడ్జెట్ విషయంలో రాజీ పడరు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు` అని చెప్పింది.
గబ్బర్ సింగ్లా ఎంటర్టైన్ చేసే మూవీ ఉస్తాద్ భగత్ సింగ్
శ్రీలీలతో నాకు కలిసి సన్నివేశాలు లేవు. ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. నా పాత్రలో కూడా మంచి వేరియేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని హరీష్ గారు ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పాను. కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పని చేశాను. 'గబ్బర్ సింగ్' లాగే ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, అందరూ కలిసి థియేటర్లో చూడొచ్చు. ఉగాది పండుగ సమయంలో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు` అని చెప్పింది. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ తో ఒక సినిమా, 'ఫర్జీ 2' షో చేస్తుందట. అమెజాన్ సిరీస్ లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తుందట. అలాగే తమిళంలో 'రౌడీ అండ్ కో'లో నటిస్తుంది. తెలుగులోనూ కథలు వింటుందట రాశీఖన్నా.

