కరోనా ఎఫెక్ట్: 2 నెలల తరువాత ఇంటికి చేరిన స్టార్ హీరో
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయటంతో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాన్యులు మాత్రమే కాదు పలువురు సెలబ్రిటీలకు కూడా ఈ ఇబ్బందులు తప్పలేదు. ముక్యంగా విదేశాల్లో ఇరుక్కుపోయిన వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు.
మలయాళ ఇండస్ట్రీలో హీరోగా, దర్శకుడిగా సత్తాచాటుతున్న స్టార్ హీరో పృథ్వీరాజ్. ఈ యువ నటుడు ప్రస్తుతం ఆడు జీవితం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చిత్రయూనిట్ జోర్దాన్ వెళ్లింది.
ఆడు జీవితం యూనిట్ జోర్దాన్లో షూటింగ్ లో ఉండగానే ఆ దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో షూటింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. అదే సమయంలో మన దేశంలోకి విదేశీ విమానాల రాకపై ఆంక్షలు విధించటంతో యూనిట్ అంతా అక్కడే ఇరుక్కుపోయారు.
వారిని భారత్కు తీసుకువచ్చేందుకు చాలా కాలంగా మలయాళ సినీ పరిశ్రమ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో జోర్దాన్లోని చిత్రయూనిట్ తమకు ఆహారానికి కూడా కష్టంగా ఉందని చెప్పటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
అయితే తాజాగా ఆంక్షలు కొంత మేర సడలించటంతో పృథ్విరాజ్, దర్శకుడు బ్లెస్సీ సహా మరో 58 మంది చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి రావడానికి మార్గం సుగమం అయ్యింది.
ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆడు జీవితం యూనిట్ కొచ్చి చేరుకుంది. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.