- Home
- Entertainment
- Prakash Raj: ప్రకాష్ రాజ్ తల్లి కన్నుమూత.. అనాథగా కష్టాలు, పేషెంట్గా వచ్చినవాడితో లవ్ మ్యారేజ్
Prakash Raj: ప్రకాష్ రాజ్ తల్లి కన్నుమూత.. అనాథగా కష్టాలు, పేషెంట్గా వచ్చినవాడితో లవ్ మ్యారేజ్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సువర్ణలత కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆమె జీవితం చూస్తే, ఆమె పడ్డా కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ప్రకాష్రాజ్ తల్లి కన్నుమూత
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత(86) కన్నుమూశారు. గత కొంత కాలంగా వయసుకి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం ప్రకాష్ రాజ్ స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె భౌతిక కాయానికి ఈ రోజు సాయంత్రం అంత్య క్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రకాష్ రాజ్ తల్లి మరణ తెలిసి సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రకాష్ రాజ్ తల్లి అనాథ, ప్రేమ పెళ్లి
ప్రకాష్రాజ్ ది కర్నాటక. తల్లి సువర్ణలత జీవితం చిన్నప్పట్నుంచి కష్టాల మయం. పెళ్లికి ముందు ఆమె ఎన్నో కష్టాలను అనుభవించారు. ఆమె ఒక అనాథ. క్రిస్టియన్. చిన్నప్పుడు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. ఈ క్రమంలో ఆ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతాపం. మొదటి సంతానం ప్రకాష్ రాజ్. తర్వాత చెల్లి, తమ్ముడు ఉన్నారు.
సంకల్పంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ చిన్నప్పుడు స్టేజ్ యాక్టర్గా చేశాడు. అనేక నాటకాలు ప్రదర్శించారు. వీరిది పేదకుటుంబం. దీంతో పిల్లల్ని స్కూల్కి పంపించే పరిస్థితి కూడా లేదు. ఫ్యామిలీని పోషించడం కోసం నాటకాలు ప్రదర్శించేవారు. అలా సినిమాల్లోకి వచ్చాడు. తమిళ దర్శకుడు కె బాలచందర్.. ప్రకాష్ రాజ్ని చూసి సినిమాల్లోకి పనికొస్తాడని, ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. మొదట్లో సీరియల్స్ లో నటించాడు. ఆ తర్వాత తమిళంలో వచ్చిన `డ్యూయెట్` అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. కొన్నాళ్లకి `సంకల్పం` అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు.
విలక్షణ నటుడిగా రాణిస్తోన్న ప్రకాష్ రాజ్
కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించాడు ప్రకాష్ రాజ్. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు. ఇప్పుడు విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించారు. ఆయనకు ఐదు జాతీయ అవార్డులు, 8 నంది అవార్దులు, 8 తమిళ స్టేట్ అవార్డులు, 4 సైమా అవార్డులు వరించాయి. మూడు దశాబ్దాలకుపైగా చిత్రపరిశ్రమలో ఉన్నారు. వందల సినిమాలు చేశాడు. దర్శకుడిగా ఐదు చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు చాలా సెలక్టీవ్గా మూవీస్ చేస్తున్నారు. ఇటీవల `సరస్వతి` చిత్రంలో మెరిసిన ఆయన ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తోన్న `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు.

